కలం, డెస్క్ : ఇరాన్ (Iran) వర్సెస్ ఇజ్రాయెల్-అమెరికా యుద్ధం నేపథ్యంలో హర్మూజ్ జలసంధి పేరు ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తోంది. గల్ఫ్ దేశాలతో పాటు ఇరాన్ (Iran) నుంచి చమురు ఈ జలసంధి నుంచే ఎక్కువగా ఎగుమతి అవుతోంది. భారత్, చైనా, జపాన్ లాంటి దేశాలకు ఇక్కడి నుంచే ఎక్కువ చమురు వస్తోంది. ఈ జలసంధిని మూసేస్తున్నట్టు ఇప్పటికే ఇరాన్ ప్రకటించింది. ఇక్కడి నుంచి ఎలాంటి చమురు నౌకలు వెళ్లినా పేల్చేస్తామని చెప్పి.. ఇప్పటికే రెండు నౌకలను ధ్వంసం చేసింది. అయితే తాజాగా ఈ చమురు నౌకలపై తాజాగా ఇరాన్ స్పందించింది. అన్ని దేశాలకు చమురు ఆపేయాలని అనుకోవట్లేదని తెలిపింది.
ఇజ్రాయెల్, యూరప్, అమెరికా దేశాలకు వెళ్లే నౌకలను మాత్రం అడ్డుకుంటామని స్పష్టం చేసింది. మిగిలిన దేశాలకు చమురు సరఫరాను ఆపబోమని చెప్పింది. ఇరాన్ ప్రకటనతో భారత్ కు ఊరట లభించే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈ హర్మూజ్ జలసంధి నుంచే ఇండియాకు 50 శాతం కంటే ఎక్కువ చమురు దిగుమతి అవుతోంది. ఇప్పుడు ఇండియాకు చమురు ఎగుమతులను అనుమతిస్తే.. మన దగ్గర చమురు ధరలు పెరిగే ఛాన్స్ ఉండదు. కాకపోతే ఈ ప్రకటన ఎంత వరకు అమలవుతుందనేది అనుమానమే. గల్ఫ్ దేశాల్లోని చమురు కేంద్రాలను ఇప్పటికే ఇరాన్ ధ్వంసం చేసింది. అవన్నీ మళ్లీ కోలుకోడానికి ఎంత సమయం పడుతుందో చెప్పలేం. గల్ఫ్ దేశాలు ఆసియా దేశాలకు చమురు ఎగుమతి చేస్తామంటే ఇరాన్ అంగీకరిస్తుందా లేదా అన్నది తెలియదు. ఇరాన్ క్రూడ్ ఆయిల్ సరఫరా చేస్తే ఇజ్రాయెల్, అమెరికా ఊరుకుంటాయంటే డౌటే. ఈ లెక్కన ఇరాన్ ప్రకటన ఎంత వరకు అమలవుతుందో చూడాలి.

