కలం, వెబ్ డెస్క్: తప్పుడు కేసులు పెట్టిన తనను వేధించారని జాగృతి అధ్యక్షురాలు కవిత (Kavitha) పేర్కొన్నారు. తనపై పెట్టిన కేసులో కోర్టు డిశ్చార్జ్ చేసిన నేపథ్యంలో స్వామివారి దర్శనానికి వచ్చానని తెలిపారు. రేణిగుంట ఎయిర్పోర్టులో మీడియాతో మాట్లాడిన ఆమె.. తప్పుడు కేసు పెట్టి నాలుగేళ్లుగా వేధింపులకు గురి చేశారని పేర్కొన్నారు. అయితే సత్యం తన వైపే ఉండటం, దేవుడి దయతో కోర్టు ఆ కేసును డిశ్చార్జ్ చేసిందని చెప్పారు.
తిరుమల ఆలయంలోని వేంకటేశ్వర స్వామిపై తమ కుటుంబానికి ఎంతో నమ్మకం ఉందని కవిత (Kavitha) తెలిపారు. స్వామివారిని కాలినడకన దర్శించుకోవాలని మొక్కు ఉందని, కేసులో క్లీన్ చిట్ వచ్చిన సందర్భంగా కుటుంబసభ్యులు, తెలంగాణ జాగృతి సభ్యులతో కలిసి మొక్కు తీర్చుకోవడానికి వచ్చినట్లు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్లో ఉన్న తమ శ్రేయోభిలాషులు, మేలు కోరే వారు ఎయిర్పోర్టుకు వచ్చి స్వాగతం పలికారని, వారికి కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో తాము ఏర్పాటు చేయబోయే రాజకీయ పార్టీకి స్వామివారి ఆశీస్సులు ఉంటాయని నమ్ముతున్నానని కవిత పేర్కొన్నారు.

