కలం, వెబ్డెస్క్: మిడిల్ ఈస్ట్ (Middle East)లో పరిస్థితులు రోజురోజుకీ మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఇరాన్, అమెరికా (Iran – US) మధ్య శాంతి చర్చలు నిలిచిపోవడం, కాల్పుల విరమణ గడువు ముగియడంతో ఇరు దేశాలు మళ్లీ పరస్పరం దాడులకు తెగబడుతున్నాయి. తాజాగా ఇరాన్ అమెరికా స్థావరాలపై దాడులు చేసిందంటూ అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.
దీనిపై యూఎస్ సెంట్రల్ కమాండ్ ఎక్స్ వేదికగా స్పందించి అధికారిక ప్రకటన విడుదల చేసింది. జోర్డాన్లోని యూఎస్ బేస్ క్యాంప్పై మిస్సైల్స్, డ్రోన్స్తో ఇరాన్ దాడులు చేసిందని క్లారిటీ ఇచ్చింది. ఈ దాడుల్లో ఇద్దరు అమెరికన్ సైనికులు మరణించారని తెలిపింది. ఒక వ్యక్తి గల్లంతయ్యాడని, అతడి ఆచూకీ తెలియాల్సి ఉందని వెల్లడించింది.
మరో నలుగురు గాయపడ్డారని, ఆస్పత్రిలో చికిత్స అనంతరం వారు కోలుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇరాన్ అమెరికాపై (Iran US) చేసిన అతి పెద్ద దాడుల్లో ఇది కూడా ఒకటని యూఎస్ కమాండ్ కంట్రోల్ తెలిపింది. అలాగే దాడి జరిగిన కొద్ది సేపటికే ఎదురు దాడి కూడా చేసినట్లు తెలిపింది. అమెరికాపై దాడులకు బాధ్యులైన వారిని హతమార్చడమే కాకుండా హార్మూజ్ జలసంధిలో ఇరాన్ సైనిక శక్తిని అంతం చేయడమే తమ లక్ష్యమని అమెరికా స్పష్టం చేసింది.
Read Also: 2 లక్షల ఉద్యోగాలు.. మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు
Follow Us On : WhatsApp

