కలం, కరీంనగర్: జనసేన రాష్ట్ర అధ్యక్షులు నేమురి శంకర్ అక్రమ అరెస్టుకు నిరసనగా కరీంనగర్ లోని గీతా భవన్ చౌరస్తాలో జనసేన నాయకులు నిరసన (Janasena Protest) చేపట్టారు. కరీంనగర్ జనసేన పార్టీ నాయకులు కందుల రాజి రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. ఈ సందర్భంగా రాజి రెడ్డి మాట్లాడుతూ.. అక్రమ అరెస్టులు, ప్రభుత్వ పనితీరుపై విరుచుకుపడ్డారు. ప్రజలకు ఇబ్బంది కలిగి అనేక సమస్యలు ఉండగా.. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే అక్రమ అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు.
22ఏ భూముల అంశం, విద్యార్థుల ఫీజు రియింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా ప్రజల దృష్టిని మళ్ళించడానికి ఈ అరెస్టుల పర్వం కొనసాగుతుందని రాజిరెడ్డి ఫైర్ అయ్యారు. ఇలాంటి చర్యలు తగదని, ఈ అరెస్టులు ఇలాగే కొనసాగితే రానున్న కాలంలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. తెలంగాణ గురించి ఏ విధంగా కొట్లాడామో, కాంగ్రెస్ ప్రభుత్వానికి గద్దతించేందుకు కూడా అదే విధంగా ఉద్యమం చేస్తామని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లుతెరిచి 22ఏ భూములను పరిష్కరించాలని, ఫీజు రియింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని రాజిరెడ్డి డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో చొప్పదండి నియోజకవర్గం ఇంచార్జ్ మొగిలిపాలెం రమేష్, కరీంనగర్ మున్సిపల్ కాంటెస్టెంట్ కార్పొరేటర్ అభ్యర్థులు పొన్నాల తిరుపతి, వీర్ల శ్రీనివాసరావు, అంబాల సృజన్ కుమార్ జంగ మహేష్, జనసేన నాయకులు మహాదేవుని రాజ్ కుమార్, గాలిపెల్లి కుమార్, పాతూరి వేణుగోపాల్ రెడ్డి, తరుణ్, వికాస్, ప్రవీణ్, పవన్, జనసేన వీర మహిళలు తోడేటి భారతి, కుంట సుజాత, గుండా శకుంతల, నేరెళ్ల సరోజన తదితరులు పాల్గొన్నారు.

