కలం, వెబ్ డెస్క్: ఇస్లామాబాద్ (Islamabad) వేదికగా నేడు అమెరికా (US), ఇరాన్ (Iran) మధ్య చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ చర్చల కోసం ఇప్పటికే ఇరు దేశాల ప్రతినిధులు ఇస్లామాబాద్కు చేరుకున్నారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోయిన చిన్నారుల ఫోటోలతో ఇరాన్ ప్రతినిధులు చర్చలకు వచ్చారు. విమానంలో ఖాళీ సీట్లలో చిన్నారుల ఫోటోలు వాళ్ల స్కూల్ బ్యాగులు, పూలతో వారికి నివాళులు అర్పించారు. ఇరాన్పై జరిపిన దాడుల్లో ఫిబ్రవరి 28న ఓ పాఠశాలపై మిసైల్ దాడి జరిగింది. ఈ దాడిలో సుమారు 175 మంది విద్యార్థులు మృతి చెందినట్లు సమాచారం.
ఇక మరికొద్ది సేపట్లో ఇస్లామాబాద్లో చర్చలు ప్రారంభం కానున్నాయి. ఇరాన్ ప్రతినిధుల బృందానికి పార్లమెంట్ స్పీకర్ ఖలీబాఫ్ నేతృత్వం వహిస్తున్నారు. అలాగే చర్చల్లో అబ్బాస్ అరాగ్చీ, రాజకీయ, సైనిక, ఆర్థిక నిపుణులు పాల్గొననున్నారు. మరోవైపు యూఎస్ తరఫున వైఎస్ ప్రెసిడెంట్ జేడీవాన్స్ నేతృత్వం వహిస్తున్నారు. అమెరికా నుంచి స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ చర్చలకు హాజరయ్యారు. ఈ చర్చలు ఇస్లామాబాద్లోని ఓ ప్రముఖ హోటల్లో జరుగుతున్నాయి. ఈ హోటల్ సమీపంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. సుమారు పది వేలకు పైగా సైనికులు, పోలీసులు హోటల్ చుట్టూ పహారా కాస్తున్నారు.

