కలం, వెబ్ డెస్క్ : ఇరాన్ పై దాడులను రెండు వారాల పాటు నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో ప్రపంచ దేశాలు హర్షం వ్యక్తం చేశాయి. ఇక ప్రపంచ చమురు రవాణాకు కేంద్రమైన హర్మూజ్ జలసంధిని ఇరాన్ (Iran) తెరిచేస్తుందని సంబరపడిపోయారు. కానీ ఆ సంబరం ఎంతో క్షణం నిలవలేదు. తాజాగా మళ్లీ హర్మూజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటన చేసింది. లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులను కొనసాగిస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇరాన్ వెల్లడించింది.
అయితే కాల్పుల వీరమణ ఒప్పందం లెబనాన్ కు వర్తించిందని అంటూ ఆ ప్రాంతంపై ఇజ్రాయెల్ సైన్యలు దాడులకు తెగబడుతున్నాయి. హెజ్బొల్లా సంబంధిత లక్ష్యాలను కేంద్రంగా పెట్టి భారీ వైమానిక దాడులు చేస్తున్నారు. దీంతో బీరుట్ దక్షిణ ప్రాంతాలు, దక్షిణ లెబనాన్, తూర్పు బెకా లోయ ప్రాంతాలు దాడుల ప్రభావం వల్ల దద్దరిల్లాయి. 1982 తర్వాత లెబనాన్పై ఇదే అత్యంత భారీ దాడిగా చరిత్రలో నమోదు అయ్యింది.ఈ దాడుల్లో ప్రముఖ మతపెద్ద సాదిక్ అల్ నబుల్సీ కూడా మరణించినట్లు సమాచారం అందుతోంది. పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. లెబనాన్ లో ఇప్పటివరకు దాదాపు 250 మంది మరణించినట్లు వార్తలు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ తీరుపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా తో కుదుర్చుకున్న తాత్కాలిక శాంతిని నిలిపివేస్తూ.. మళ్లీ హర్మూజ్ జలసంధిని మూసివేసింది. దీంతో హర్మూజ్ లో ఆయిల్ ట్యాంకర్ల రాకపోకలు నిలిచిపోయాయి.

