కలం, వెబ్ డెస్క్ : పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఇరాన్ (Iran) కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్ రెండు వారాల పాటు కాల్పుల విరమణకు ఇరాన్ అంగీకరించింది. ఈ మేరకు ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చి (Abbas Araghchi) అధికారిక ప్రకటన చేశారు. ముఖ్యంగా పాకిస్థాన్ ప్రధాని షరీఫ్, ఫీల్డ్ మార్షల్ మునీర్ చేసిన దౌత్య ప్రయత్నాలను ఈ ప్రకటనలో ఇరాన్ కొనియాడింది. చర్చల ప్రక్రియలో భాగంగా అమెరికా ప్రతిపాదించిన 15 సూత్రాలు, అలాగే ఇరాన్ ప్రతిపాదించిన 10 సూత్రాల ప్రాతిపదికన ముందుకు వెళ్లేందుకు ఇరు దేశాలు ప్రాథమికంగా ఒక అవగాహనకు వచ్చాయి.
ఈ కాల్పుల విరమణ కాలంలో ఇరాన్పై దాడులు ఆగిపోతే, తమ సాయుధ దళాలు కూడా రక్షణ కార్యకలాపాలను నిలిపివేస్తాయని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ స్పష్టం చేసింది. అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి ద్వారా నౌకల రాకపోకలకు సంబంధించి కూడా ఇరాన్ కీలక హామీ ఇచ్చింది. రాబోయే రెండు వారాల పాటు ఇరాన్ సాయుధ దళాల సమన్వయంతో హర్మూజ్ గుండా నౌకల సురక్షిత ప్రయాణానికి అనుమతి ఉంటుందని పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలపడం, చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి మొగ్గు చూపడం పశ్చిమాసియా రాజకీయాల్లో ఒక నూతన అధ్యాయానికి నాంది పలుకుతోంది.
ఇరాన్ 10 సూత్రాల ప్రతిపాదన..
శాంతి స్థాపన కోసం ఇరాన్ (Iran) ప్రభుత్వం 10 ప్రధాన సూత్రాలతో కూడిన ఒక కార్యాచరణను సిద్ధం చేసింది. కేవలం తాత్కాలిక కాల్పుల విరమణే కాకుండా, సుదీర్ఘ కాలం పాటు ప్రాంతీయ స్థిరత్వాన్ని కాపాడడమే లక్ష్యంగా ఈ ప్రతిపాదనలను రూపొందించినట్లు విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ 10 సూత్రాల ఫ్రేమ్వర్క్ను చర్చలకు ప్రాతిపదికగా అంగీకరించడంతో, దౌత్య పరమైన చర్చలు మరింత వేగం పుంజుకోనున్నాయి. ఈ చొరవ వల్ల అటు అంతర్జాతీయ చమురు సరఫరాకు ఆటంకం కలగకుండా ఉండటంతో పాటు, అశాంతిలో ఉన్న పశ్చిమాసియా దేశాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది.

