కలం, వెబ్ డెస్క్: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)తో పాక్ ప్రధాని షెహనబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్లు కీలక చర్చలు జరిపారు. ఈ చర్చల అనంతరం ఇరాన్పై దాడులు నిలిపివేయాలని ట్రంప్ నిర్ణయించుకున్నారు. అమెరికాతో పాటు మధ్యప్రాచ్య దేశాల తరపున ఈ ప్రకటన చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ ప్రతిపాదించిన 10 పాయింట్ల శాంతి ప్రణాళిక చర్చలకు ఆమోదయోగ్యంగా ఉందని ట్రంప్ పేర్కొన్నారు. హార్మూజ్ జలసంధిని వెంటనే అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఇరాన్ అంగీకరించాలనే షరతుపై, రాబోయే రెండు వారాల పాటు ఇరాన్పై అన్ని రకాల దాడులు నిలిపివేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. దీన్ని ఇరుపక్షాల మధ్య కుదిరిన డబుల్ సైడెడ్ సీజ్ ఫైర్గా ట్రంప్ అభివర్ణించారు.
మిడిల్ ఈస్ట్లో శాంతిని నెలకొల్పే దిశగా ఇరాన్తో కుదుర్చుకోబోయే తుది ఒప్పందానికి ఈ రెండు వారాల విరామం ఎంతో కీలకమని ట్రంప్ వెల్లడించారు. యుద్ధంలో అమెరికా ఇప్పటికే తన సైనిక లక్ష్యాలకు మించి ఎంతో సాధించిందని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య ఉన్న వివాదాస్పద అంశాలపై దాదాపు ఒక అవగాహన కుదిరిందని ఆయన తెలిపారు. ఎంతో కాలంగా కొనసాగుతున్న ఈ సంక్షోభం పరిష్కారానికి దగ్గరగా ఉండటం గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

