కలం, నారాయణపేట: జిల్లా ప్రజలకు పారదర్శకమైన పోలీస్ సేవలు అందించాలని ఎస్పీ డాక్టర్ వినీత్ కుమార్ (Narayanpet SP Vineeth kumar) అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని టౌన్ పిఎస్ ను ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్టేషన్కు వచ్చిన ప్రతి పిర్యాదుదారు పిటిషన్ను రికార్డులో ఎంట్రీ చేసి, నిర్దిష్ట సమయంలో విచారణ పూర్తి చేసి ఫిర్యాదుదారులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఎలాంటి పిటిషన్ను అనవసరంగా పెండింగ్లో ఉంచరాదని, ఒకవేళ పెండింగ్లో ఉంటే దానికి గల కారణాలను వారికి తెలుపుతూ రికార్డుల్లో స్పష్టంగా నమోదు చేయాలని సూచించారు. ప్రజల భద్రతే పోలీసుల ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. స్టేషన్లోని అన్ని రికార్డులు, రిజిస్టర్లు, కేసు వివరాలు పూర్తిస్థాయిలో, ఎలాంటి లోపాలు లేకుండా నమోదు చేయాలని ఆదేశించారు.
ప్రజలకు మరింత త్వరితగతిన న్యాయం అందించేందుకు అవసరమైన చోట ఆన్సైట్ ఎఫ్ఐఆర్ (On-site FIR) నమోదు చేసే విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారునికి వారి ఫిర్యాదుకు సంబంధించిన రసీదు తప్పనిసరిగా అందజేయాలని, కేసు నమోదు చేసిన అనంతరం ఎఫ్ఐఆర్ కాపీని ఉచితంగా ఇవ్వాలని స్పష్టం చేశారు. ఎస్పీ వెంట డీఎస్పీ నల్లపు లింగయ్య, టౌన్ సీఐ శివశంకర్, ఎస్ఐ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

