కలం, నారాయణపేట: నారాయణపేట (Narayanpet) ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల సాధన కోసం ఆగస్టు 1న తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాదులోని ఇందిరాపార్క్ వద్ద మహాధర్న కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం-తపస్ (TPUS) జిల్లా అధ్యక్షులు నరసింహ అన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికలను బుధవారం మండలంలోని జాజాపూర్ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఉపాధ్యాయులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పెండింగ్ లో ఉన్న సమస్యల సాధన కోసం అనేకసార్లు విన్నవించిన ప్రభుత్వం స్పందించకపోవడం వల్లే దశల వారి ఉద్యమ కార్యాచరణకు పిలుపు ఇవ్వడం జరిగిందని తెలిపారు.
పీఆర్సీ వెంటనే ప్రకటించాలని, ఆరు డీఏలు విడుదల చేయాలని నరసింహ డిమాండ్ చేశారు. సీపీఎస్ విధానం రద్దు పరిచి పాత పెన్షన్ అమలు చేయాలని, 317 జీవో బాధితులకు న్యాయం చేయాలని కోరారు. కేజీబీవీ ఉపాధ్యాయులకు ఎంటిఎస్ అమలు చేయాలని, సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, పెండింగ్ లో ఉన్న అన్ని రకాల బిల్లులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. మహాధర్నా కార్యక్రమంలో ఉపాధ్యాయులందరూ అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగేష్, సురేష్ బాబు, నర్సింలు, కరుణాకర్, తపస్ జిల్లా మండల బాధ్యులు పాల్గొన్నారు.

