కలం, వరంగల్ బ్యూరో: బాధ్యతాయుతంగా పనిచేస్తున్న ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి (Naini Rajender Reddy) పై నిరాధార ఆరోపణలు చేస్తే కాంగ్రెస్ పార్టీ సహించబోదని హనుమకొండ డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామిరెడ్డి (Inugala Venkatrami Reddy) హెచ్చరించారు. హనుమకొండ (Hanumkonda) జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అడ్డిమారి దెబ్బలో గెలిచిన నాయకుడు నాయిని కాదని, ప్రజల ఆశీస్సులతో గెలిచి అభివృద్ధి కోసం పనిచేస్తున్న నాయకుడని అన్నారు. ఆలయ వ్యవహారాలకు సంబంధం లేని ఎమ్మెల్యేని ఉద్దేశపూర్వకంగా లాగడం రాజకీయ కుట్రలో భాగమని విమర్శించారు. విగ్రహాల పేరుతో రాజకీయ పబ్బం గడపాలని కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. నిజంగా పురాతన విగ్రహాలు బయటపడితే దేవాదాయ, పురావస్తు శాఖ అధికారులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని ప్రశ్నించారు.
ప్రభుత్వ భూములను కాపాడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే కృషి చేస్తుంటే, కొందరు రెడీమేడ్ విగ్రహాలను తీసుకొచ్చి రాజకీయ నాటకాలకు తెరలేపుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. శాయంపేట హనుమాన్ ఆలయానికి ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సొంత ఖర్చులతో నిధులు అందించారని గుర్తుచేశారు. ఎమ్మెల్యే నాయినికి ఉన్న భక్తి, నిబద్ధత ఎంత ఉందో ప్రజలకు తెలుసని పేర్కొన్నారు. మొత్తం ఆలయ వ్యవహారంలో నిజమైన హనుమాన్ భక్తుడు ఒక్కరే ఉన్నారని, మిగతా హడావుడి అంతా బీఆర్ఎస్ నేతల రాజకీయ ప్రదర్శన మాత్రమేనని విమర్శించారు. రాజస్థాన్లో విగ్రహాలు తయారు చేయించి, వాటికి సంబంధించి సొంత పార్టీ నేతలే డబ్బులు పంపిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, అసత్య ప్రచారాలతో కాంగ్రెస్ పార్టీని, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిని దెబ్బతీయాలని చూసే ప్రయత్నాలు ఫలించవని హెచ్చరించారు.

