కలం, వెబ్ డెస్క్: భారత మహిళా రెజ్లింగ్ రంగానికి సరికొత్త వారసులు సిద్ధమయ్యారు. ఈ ఏడాది జరగబోయే ఆసియా గేమ్స్(Asian Games 2026)లో దేశం తరఫున పతకాల వేటలో పాల్గొనబోయే మహిళా రెజ్లర్ల జట్టు శనివారం ఖరారైంది. న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన సెలక్షన్ ట్రయల్స్లో అంతిమ్ పంగల్, నిషా దహియా, మనీషా భాన్వాలా, దీపాన్షి తమ అద్భుతమైన ప్రతిభతో దూసుకెళ్లి ఆసియా గేమ్స్ జట్టులో స్థానాలను అధికారికంగా సొంతం చేసుకున్నారు.
ఈ ఎంపిక పోటీలలో యువ రెజ్లర్లు మ్యాట్పై పవర్ఫుల్ ప్రదర్శన ఇచ్చారు. ముఖ్యంగా 53 కేజీల విభాగంలో రెండుసార్లు యూ20 వరల్డ్ ఛాంపియన్ అయిన అంతిమ్ పంగల్ అద్భుత ఆటతీరును ప్రదర్శించారు. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ పోరులో ఆమె ఆసియా ఛాంపియన్షిప్ సిల్వర్ మెడలిస్ట్ మీనాక్షి గోయత్పై 3-2 తేడాతో విజయం సాధించి ఆసియా గేమ్స్ బెర్త్ను కైవసం చేసుకున్నారు. అలాగే 68 కేజీల విభాగంలో నిషా దహియా ఎక్కడా తగ్గకుండా పోరాడి 4-3 తో మాన్సి లాథర్పై కష్టసాధ్యమైన విజయాన్ని నమోదు చేసి జట్టులో చోటు ఖాయం చేసుకున్నారు.
మరోవైపు 57 కేజీల విభాగంలో 2025 ఆసియా ఛాంపియన్షిప్ గోల్డ్ మెడలిస్ట్ మనీషా తన అద్భుత ఫామ్ను కొనసాగిస్తూ ఫైనల్ మ్యాచ్లో నేహాపై 8-2 తో ఘనవిజయం సాధించారు. అదేవిధంగా 50 కేజీల విభాగంలో యూ15 ఆసియా ఛాంపియన్ దీపాన్షి 9-3 తో ప్రియాన్షిని ఓడించి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు. మిగిలిన విభాగాలలో భాగ్యశ్రీ 10-0 తో, నితిక 8-3 తో, సవిత 4-3 తో విజయాలు సాధించి జట్టును మరింత పటిష్టం చేశారు. 76 కేజీల విభాగంలో ప్రియ, కాజల్ తమ సెమీఫైనల్స్ లో గెలిచి ముందడుగు వేశారు.
ఈ ఎంపికల అనంతరం రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) అధ్యక్షుడు సంజయ్ సింగ్ మాట్లాడుతూ.. అద్భుత ప్రదర్శనతో జట్టుకు ఎంపికైన రెజ్లర్లందరికీ తన హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ట్రయల్స్లో పోటీ తత్వం ఎంతో అద్భుతంగా సాగిందని, మన దేశంలో మహిళా రెజ్లింగ్ భవిష్యత్తు చాలా బలంగా ఉందని కొనియాడారు. ఈ అథ్లెట్లు టెక్నికల్గా ఎంతో ప్రతిభను చూపించారని, ఆసియాలోనే అత్యుత్తమ క్రీడాకారులకు వీరు గట్టి పోటీ ఇవ్వగలరనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ వారికి శుభాకాంక్షలు చెప్పారు.

