Mobile Popup Ad
Mobile Popup Ad

అత్యవసర ప్రయాణం.. టికెట్ లేకున్నా ట్రైన్‌లో వెళ్లొచ్చా? రైల్వే రూల్స్ ఇవే

కలం, వెబ్‌డెస్క్: సాధారణంగా టికెట్ లేకుండా ప్రయాణించడం నిబంధనలకు విరుద్ధం. ఈ విషయం మనందరికి తెలుసు. మనం రెగ్యులర్‌గా బస్సుల్లో, రైళ్లలో ప్రయాణించేటపుడు “టికెట్ లేని ప్రయాణం చట్టరీత్యా నేరం” అని కొన్ని కోట్స్ కూడా చదువుతుంటాం. కానీ కొన్నిసార్లు ఊహించని అత్యవరసర పరిస్థితులు వస్తుంటాయి. అలాంటప్పుడు మనం టికెట్ కొనే సమయం లేక ట్రైన్ (Train) ఎక్కేస్తాం. కానీ అలా ఎక్కవచ్చా? భారీ జరిమానా విధిస్తారా? అనే భయాందోళనలు మనకు కలుగుతాయి. అయితే అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా భారతీయ రైల్వే (Indian Railway) కొన్ని ప్రత్యేక వెసులు బాట్లు కల్పించింది. దానికోసం కొన్ని నిబంధనలు అమలు చేస్తోంది. అవేంటో తెలుసుకుందాం.

ప్లాట్‌ఫామ్ టికెట్ నియమం

రైల్వే రూల్స్ ప్రకారం.. ప్రయాణికుడి వద్ద కనీసం ప్లాట్‌ఫాం టికెట్ ఉండాలి. ఈ టికెట్ ద్వారా ప్రయాణికుడు ఏ స్టేషన్ నుంచి ప్రయాణం ప్రారంభించాడో గుర్తించడానికి అవకాశం ఉంటుంది.

TTE ద్వారా ఎక్సెస్ ఫేర్ టికెట్ (EFT) పొందడం

రైలులో ఎక్కిన తర్వాత వెంటనే టీటీఈని సంప్రదించి పూర్తి వివరాలు చెప్పాలి. ఆ తర్వాత ప్రయాణికుడు వెళ్లాల్సిన గమ్యస్థానం వరకు టికెట్ ఛార్జీని టీటీఈ ద్వారా చెల్లించాలి. చెల్లింపు అనంతరం టీటీఈ అధికారిక రసీదు జారీ చేస్తారు. ఇది మీ ప్రయాణాన్ని చెల్లుబాటు అయ్యేలా చేస్తుంది.

అయితే ఈ విధానం ద్వారా ప్రయాణం చేయడానికి అవకాశం ఉన్నప్పటికీ రిజర్వేషన్ సీటు కచ్చితంగా వస్తుందనే హామీ ఉండదు. ఖాళీ సీట్లు ఉంటే మాత్రమే టీటీఈ సీటు కేటాయించే అవకాశం ఉంటుంది. లేదంటే జనరల్ కంపార్ట్‌మెంట్‌లో ప్రయాణించాల్సి రావచ్చు. టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న విషయాన్ని టీటీఈకి తెలియజేయకుండా తనిఖీల్లో పట్టుబడితే జరిమానా విధించే అవకాశం ఉంటుంది. సాధారణంగా జరిమానాతో పాటు ప్రయాణ ఛార్జీ కూడా వసూలు చేస్తారు. సాధ్యమైనంత వరకు ముందుగానే ఐఆర్‌సీటీసీ యాప్ లేదా రైల్వే కౌంటర్ ద్వారా టికెట్ బుక్ చేసుకోవడం ఉత్తమమని రైల్వే అధికారులు సూచిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>