కలం, వెబ్ డెస్క్ : యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) లో నివసిస్తున్న, పర్యటిస్తున్న భారతీయ పౌరుల కోసం అబుదాబిలోని భారత రాయబార కార్యాలయం (Indian Embassy) ఒక ముఖ్యమైన భద్రతా మార్గదర్శకాన్ని జారీ చేసింది. ప్రస్తుత ప్రాంతీయ పరిస్థితుల దృష్ట్యా స్థానిక చట్టాలను, భద్రతా నియమాలను ఖచ్చితంగా పాటించాలని ఎంబసీ కోరింది. ముఖ్యంగా సంఘటన స్థలాలు, నిషేధిత ప్రాంతాలు లేదా విమానాశ్రయాల లోపల అనధికారికంగా ఫొటోలు తీయడం, వీడియోలు రికార్డ్ చేయడం వంటి పనులపై యూఏఈ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించింది.
ఏదైనా ప్రమాద హెచ్చరిక సైరన్ వినిపించినప్పుడు పౌరులు వెంటనే సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని, ఆ సమయంలో ఫొటోలు తీయడానికి బయటకు రావద్దని సూచించింది. క్షిపణి శకలాలు లేదా ఇతర నష్టాలకు సంబంధించిన చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం లేదా ఇతరులతో పంచుకోవడం చట్టవిరుద్ధమని తెలిపింది. మీ పరిసరాల్లో అనుమానాస్పద వస్తువులు లేదా శకలాలు కనిపిస్తే వాటిని తాకకుండా వెంటనే అధికారులకు సమాచారం అందించాలని ఎంబసీ కోరింది. విమానాశ్రయాల్లో రాకపోకల సమయంలో కూడా మొబైల్ ఫోన్లతో చిత్రీకరణ చేయడం నిబంధనలకు విరుద్ధమని తెలిపింది. చట్టపరమైన ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్త వహించాలని భారతీయ పౌరులకు ఈ అడ్వైజరీ జారీ చేసింది.
Read Also: ఒక్క డ్యాన్స్ వీడియో.. భారతీయుడి వీసాకే ఎసరు?
Follow Us On: Facebook

