ఒక్క డ్యాన్స్ వీడియో.. భారతీయుడి వీసాకే ఎసరు?

కలం, వెబ్​ డెస్క్​ : అమెరికాలో నివసిస్తున్న మధు రాజు (Madhu Raju) అనే భారత సంతతి వ్యక్తి ఒక చిన్న తప్పు చేసి ఇప్పుడు దేశం విడిచి వెళ్లాల్సిన పరిస్థితిని కొనితెచ్చుకున్నారు. వాషింగ్టన్ డీసీలోని అత్యంత పవిత్రమైన రెండో ప్రపంచ యుద్ధ స్మారక చిహ్నం (WW2 Memorial) వద్ద అతను డ్యాన్స్ చేస్తూ తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడమే దీనికి కారణం. దాదాపు 4 లక్షల మంది అమెరికా సైనికుల త్యాగానికి గుర్తుగా ఉన్న ఆ ప్రదేశంలో ఇలా టిక్ టాక్ వీడియోలు చేయడం పట్ల అమెరికన్లు, అక్కడి అధికారులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

ఈ ఘటనతో మధు రాజు చిక్కుల్లో పడ్డారు. అతను 2025 జూన్ నుండి పాలో ఆల్టో నెట్‌వర్క్స్‌లో క్లౌడ్ నెట్‌వర్క్ సెక్యూరిటీ ఇంజనీర్‌గా పనిచేస్తున్నట్లు గుర్తించిన నెటిజన్లు, ఆ సంస్థను ట్యాగ్ చేస్తూ ఫిర్యాదులు చేశారు. దీంతో అతను తన సోషల్ మీడియా ఖాతాలన్నింటినీ తొలగించాల్సి వచ్చింది. అంతేకాకుండా అతను నడుపుతున్నట్లు చెబుతున్న మ్యాడ్ డల్లాస్ డ్యాన్స్ స్టూడియో వెబ్‌సైట్ కూడా మూతపడింది.

అమెరికా వలస చట్టాల ప్రకారం నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాపై ఉన్న వ్యక్తులు అక్కడి నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే వారి వీసా రద్దయ్యే అవకాశం ఉంటుంది. ఫెడరల్ స్మారక చిహ్నాల (WW2 Memorial) వద్ద అనుమతి లేకుండా ప్రదర్శనలు ఇవ్వడం లేదా శాంతికి భంగం కలిగించడం వంటి చర్యలు క్రమశిక్షణారాహిత్యం కిందకు వస్తాయి. ఈ నేపథ్యంలోనే అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు అతని వీసా స్థితిగతులపై సమీక్ష జరుపుతున్నారు. తన చర్యకు మధు రాజు క్షమాపణలు చెప్పినప్పటికీ, రాబోయే వారాల్లో జరిగే అధికారిక విచారణ తర్వాతే అతన్ని భారత్‌కు పంపించే విషయంలో తుది నిర్ణయం వెలువడనుంది.

Read Also: యూఏఈలో భారతీయులకు హెచ్చరిక: ఈ రూల్స్ అతిక్రమిస్తే జైలుకే!

Follow Us On: Facebook

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>