కలం, యాదగిరిగుట్ట: యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లో పోలింగ్ కేంద్రాల (Polling Stations) రేషనలైజేషన్ (Rationalisation) ప్రతిపాదనలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి పంపించే ప్రక్రియపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో అదనపు కలెక్టర్ సమావేశం నిర్వహించారు. సైట్ గడువు ముగిసిన నేపథ్యంలో అందిన ప్రతిపాదనలను పరిశీలించి, నిబంధనల ప్రకారం తదుపరి చర్యల కోసం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయానికి పంపనున్నట్లు అదనపు కలెక్టర్ తెలిపారు. రేషనలైజేషన్ ప్రక్రియలో పారదర్శకత పాటించాలని, ఎన్నికల నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. అన్ని రాజకీయ పార్టీలకు సంబంధిత సమాచారం అందేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రస్తుతం 257 పోలింగ్ కేంద్రాలు ఉండగా, మరో 5 కేంద్రాలను అదనంగా ప్రతిపాదించినట్లు తెలిపారు. ఆలేరు నియోజకవర్గంలో 309 పోలింగ్ కేంద్రాలు ఉండగా, మరో 4 కేంద్రాలను ప్రతిపాదించినట్లు వివరించారు. రేషనలైజేషన్ అనంతరం జిల్లా పరిధిలో మొత్తం పోలింగ్ కేంద్రాల సంఖ్య 575 కు చేరినట్లు రాజకీయ పార్టీల ప్రతినిధులకు వెల్లడించారు. పోలింగ్ కేంద్రాల మార్పులు, విలీనాలు లేదా కొత్త కేంద్రాల ఏర్పాటులో ఎన్నికల నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచించారు. ప్రతిపాదిత మార్పులపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల నుంచి అభిప్రాయాలు, సూచనలు స్వీకరించారు. ఈ సమావేశంలో ఆర్డీవో కృష్ణారెడ్డి, ఇతర అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

