కలం, వెబ్ డెస్క్: బంగ్లాదేశ్ సహా ఏ దేశ పౌరులైనా అక్రమంగా ఇండియాలో (India) ఉంటే, అలాంటి వారిని గుర్తించి తరలిస్తామని కేంద్ర విదేశాంగ శాఖ ప్రకటించింది. ఇందుకు సంబంధించి స్పష్టమైన చట్టాలున్నాయని, వారిని గౌరవంగా ఆయా దేశాలకు పంపిస్తామని అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ అన్నారు. బంగ్లాదేశ్, భారత్ మధ్య అక్రమ నివాసితులను పంపించేసే ప్రత్యేక వ్యవస్థ కూడా ఉందని గుర్తు చేశారు. ఇలా పంపించే సమయంలో వారిపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోబోమని హామీ ఇచ్చారు. పరస్పర సంప్రదింపుల ద్వారానే ఈ ప్రక్రియ సున్నితంగా, సజావుగా సాగుతుందని పేర్కొన్నారు.
అమెరికా నుంచి వెయ్యి మంది వెనక్కి..
గత ఏడాది కాలంగా అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్న 1,076 మంది భారత పౌరులు స్వదేశానికి చేరుకున్నట్లు విదేశాంగ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ అన్నారు. 2025లో 3,567 మంది ఇలా వెనక్కి వచ్చారని వివరించారు. భారత్, అమెరికా మధ్య అక్రమ నివాసితుల గురించి నిరంతరం చర్చలు జరుగుతున్నట్లు వివరించారు.

