కలం, స్పోర్ట్స్ : వరల్డ్ టీమ్ స్నూకర్ చాంపియన్షిప్ (World Team Snooker Championship) లో భారత్కు తొలి మ్యాచ్లో నిరాశ ఎదురైంది. చైనాలోని గ్వాంగ్డాంగ్లో మంగళవారం జరిగిన గ్రూప్-బి మ్యాచ్లో ఆతిథ్య జట్టు చైనా బీ చేతిలో భారత్ 3-2 తేడాతో ఓటమి పాలైంది. ఈ ఫలితంతో బుధవారం టర్కీతో జరిగే మ్యాచ్ భారత్కు తప్పనిసరిగా గెలవాల్సిన పోరుగా మారింది. ఐదు ఫ్రేమ్ల ఈ మ్యాచ్లో భారత్కు విజయావకాశాలు వచ్చినప్పటికీ వాటిని పూర్తిగా ఉపయోగించుకోలేకపోయింది. తొలి ఫ్రేమ్లో ఆదిత్య మెహతా విజయం సాధించి భారత్కు శుభారంభం అందించాడు.
అయితే రెండో ఫ్రేమ్లో జౌ జిన్హావో, పంకజ్ అద్వానీపై గెలిచి చైనాను సమం చేశాడు. ఆ తర్వాత జరిగిన డబుల్స్ మ్యాచ్లో జిన్హావో, జు జియన్హావో జోడీ విజయం సాధించి చైనా బీకి 2-1 ఆధిక్యం అందించింది. నాలుగో ఫ్రేమ్లో పంకజ్ అద్వానీ అద్భుత ఆటతో మా హైలాంగ్పై గెలిచి స్కోరును 2-2తో సమం చేశాడు. దీంతో మ్యాచ్ ఫలితం చివరి ఫ్రేమ్పై ఆధారపడింది. నిర్ణాయక ఫ్రేమ్లో ఆదిత్య మెహతా, జౌ జిన్హావో మధ్య హోరాహోరీ పోరు సాగింది.
ఒక దశలో మెహతాకు అవకాశం కనిపించినా, కీలక సమయంలో చేసిన పొరపాటును జిన్హావో సద్వినియోగం చేసుకున్నాడు. వరుసగా పాయింట్లు సాధించి ఫ్రేమ్తో పాటు మ్యాచ్ను కూడా చైనా బీ ఖాతాలో వేసాడు. ఇప్పటికే టర్కీపై 3-0తో విజయం సాధించిన చైనా బీ గ్రూప్లో తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. మరోవైపు భారత్కు ఇప్పుడు టర్కీతో మ్యాచ్ అత్యంత కీలకంగా మారింది.

