కలం, వెబ్ డెస్క్: మిడిల్ ఈస్ట్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఇరాన్ (Iran) అనుమతితో రెండు భారత ఎల్పీజీ నౌకలు (India LPG Ships) హార్మూజ్ జలసంధిని దాటాయి. బీడబ్ల్యూ ఈఎల్ఎం(BW ELM), బీడబ్ల్యూ టీవైఆర్ (BW TYR) వేగంగా భారత్ దిశగా కదులుతున్నాయని అధికారులు వెల్లడించారు. ఈ రెండు నౌకలు 94,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీని మోసుకొస్తున్నాయి. ఈ నిల్వలు దేశంలో ఒక రోజు ఎల్పీజీ అవసరాలను తీరుస్తాయి. ఇప్పటికే నాలుగు భారత ఎల్పీజీ నౌకలు హార్మూజ్ను దాటి సురక్షితంగా ఇండియాకు చేరుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇరాన్తో జరిపిన దౌత్యపరమైన చర్చల ఫలితంగా నౌకలు సురక్షితంగా బయటపడటంతో దేశంలో ఎల్పీజీ కొరత ముప్పు తప్పుతుందని అధికారులు భావిస్తున్నారు. బీడబ్ల్యూ టీవైఆర్ మార్చి 31న ముంబైకి, బీడబ్ల్యూ ఈఎల్ఎం ఏప్రిల్ 1న మంగళూరుకు చేరుకోనున్నాయి.
నౌకాయాన మంత్రిత్వ శాఖ తాజా సమాచారం ప్రకారం ఇప్పటికీ పశ్చిమాసియాలో 485 మంది భారతీయ సిబ్బందితో కూడిన 18 నౌకలు (India LPG Ships) సురక్షితంగా బయటపడటానికి ఎదురుచూస్తున్నాయి. ఇప్పటి వరకు 942 మంది భారతీయ సిబ్బందిని ప్రభుత్వం సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చింది. షిప్పింగ్ డైరెక్టరేట్ జనరల్ నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తూ, కంట్రోల్ రూమ్ ద్వారా సహాయక చర్యలు అందిస్తోంది. ప్రస్తుతం దేశంలోని పోర్టుల కార్యకలాపాలు ఎక్కడా అంతరాయం లేకుండా సాధారణంగానే సాగుతున్నాయని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
Read Also: మావోయిస్టు పార్టీ : 60 ఏళ్ళ ప్రస్థానం.. రెండేళ్లలో పతనం!?
Follow Us On : WhatsApp

