కలం, వెబ్ డెస్క్: అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ (ADR Report) విడుదల చేసిన నివేదిక భారతదేశ రాజకీయాల్లో మహిళా ప్రజాప్రతినిధుల ఆర్థిక స్థితిగతులను వెలుగులోకి తెచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న మహిళా ఎంపీలు, ఎమ్మెల్యేలలో 14 మంది బిలియనీర్లుగా ఉన్నారని, వీరి మొత్తం ఆస్తుల విలువ రూ. 8,234 కోట్లు అని నివేదిక వెల్లడించింది. అయితే చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యం మాత్రం ఇప్పటికీ ఆశించిన స్థాయిలో లేదనే విమర్శలున్నాయి. మొత్తం 4,766 మంది ప్రజాప్రతినిధులలో మహిళలు కేవలం 476 మంది (10 శాతం) మాత్రమే ఉన్నారని తెలుస్తోంది.
ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అగ్రస్థానంలో నిలిచింది. దేశంలోనే అత్యంత ధనవంతులైన మొదటి ముగ్గురు మహిళా ప్రజాప్రతినిధులు ఏపీకి చెందినవారే కావడం విశేషం. నెల్లూరు జిల్లా కొవూరు టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి రూ. 716.33 కోట్ల ఆస్తులతో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలవగా, కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవి (రూ. 388.10 కోట్లు), నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి (రూ. 291.17 కోట్లు) తర్వాతి స్థానాల్లో నిలిచారు.
తెలంగాణ మహిళా ప్రజాప్రతినిధుల ఆస్తుల విలువ ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే చాలా తక్కువగా ఉంది. తెలంగాణలో 11 మంది మహిళా ఎంపీలు, ఎమ్మెల్యేల మొత్తం ఆస్తుల విలువ రూ. 159.03 కోట్లు కాగా, ఇక్కడ ఒక్కో ప్రతినిధి సగటు ఆస్తి సుమారు రూ. 14.45 కోట్లుగా ఉంది. జాతీయ స్థాయిలో మహిళా ప్రతినిధుల సగటు ఆస్తి రూ. 17.30 కోట్లుగా ఉందని 2024 ఎన్నికల అఫిడవిట్ల ఆధారంగా రూపొందించిన ఈ ADR Report స్పష్టం చేసింది.
Read Also: తిరుపతి రమాదేవి ఆసుపత్రిలో అమానుష ఘటన
Follow Us On: Instagram

