Mobile Popup Ad
Mobile Popup Ad

సింధు జలాలపై ‘సప్లిమెంట్​ అవార్డ్​’ చెల్లదు: భారత్​

కలం, వెబ్​డెస్క్​: సింధు జలాల (Indus Waters) పై ఇంటర్నేషనల్​ ఆర్బట్రేషన్​ కోర్ట్​ ఇచ్చిన ‘సప్లిమెంట్​ అవార్డ్​’ చెల్లదని భారత్​ స్పష్టం చేసింది. జమ్మూకశ్మీర్​లోని కిషన్​ గంగ, రాట్లే జలవిద్యుత్​ ప్రాజెక్టులకు సంబంధించి ఆపరేషన్​ లాగ్​బుక్స్​ను ఫిబ్రవరి 9లోగా సమర్పించాలంటూ ఆర్బిట్రేషన్​ కోర్టు ఇచ్చిన తీర్పును భారత్​ తోసిపుచ్చింది.

గత ఏడాది పహల్గామ్​ ఉగ్రదాడి అనంతరం పాక్​తో ఉన్న సింధు జలాల ఒప్పందాన్ని భారత్​ రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే, దీనిపై నెదర్లాండ్స్​లోని హేగ్​ కేంద్రంగా పనిచేసే అంతర్జాతీయ ఆర్బిట్రేషన్​ కోర్టుకు పాకిస్థాన్​ ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో ఆ రెండు జలవిద్యుత్​ కేంద్రాల నిర్వహణ వివరాలు గడువులోగా తమకు అందించాలని, లేకపోతే ఎందుకు ఇవ్వలేదో వివరణ ఇవ్వాలని ఆర్బిట్రేషన్​ కోర్టు భారత్​కు ‘సప్లిమెంట్​ అవార్డ్​’ పేరుతో ఆదేశాలు జారీ చేసింది.

దీనిపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సోమవారం ఘాటుగా స్పందించింది. సింధు జలాల ఒప్పందం ప్రస్తుతం అమలులో లేదని స్పష్టం చేసింది. అందువల్ల ఆ ఒప్పందం కింద ఉన్న ఎలాంటి బాధ్యతలను భారత్ నిర్వహించాల్సిన అవసరం లేదని కుండబద్దలు కొట్టింది.

‘చట్టపరంగా ఉనికే లేని, అక్రమంగా ఏర్పాటు చేసిన ఈ ఆర్బిట్రేషన్ సంస్థకు భారత్ సార్వభౌమ హక్కుల కింద తీసుకున్న చర్యల చట్టబద్ధతను సమీక్షించే అధికారమే లేదు. ఇదేకాదు, అసలు ఏ కోర్టుకైనా, భారత్ చర్యలను పరిశీలించే అధికారం ఉండదు’ అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.

‘ఈ ఆర్బిట్రేషన్ కోర్టుకు చట్టపరమైన గుర్తింపు లేదనేది భారత్ కచ్చితమైన విధానం. ఈ అక్రమ సంస్థ ఏర్పాటే సింధు జలాల (Indus Waters) ఒప్పందానికి విరుద్ధం. అందువల్ల ఈ వేదిక ముందు జరిగే ఏ ప్రక్రియ అయినా, అక్కడ తీసుకునే ఏ నిర్ణయమైనా చట్టబద్ధత లేనిదే’ అని స్పష్టం చేసింది.

పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నంత కాలం సింధు జలాల ఒప్పందం అమలులో ఉండదనేది భారత్ అధికారిక వైఖరి అని ఎంఈఏ పేర్కొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>