Mobile Popup Ad
Mobile Popup Ad

అందుకే ఓడిపోయాం.. అసలు కారణం చెప్పిన అభిషేక్ శర్మ

కలం, వెబ్ డెస్క్ : పసికూన ఐర్లాండ్ చేతిలో ఎదురైన ఓటమిపై భారత ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) నోరు విప్పాడు. తమ ఓటమికి అసలు కారణం ఏంటో వివరించాడు. పరిస్థితులకు అలవాటు పడలేకపోవడం వల్లే భారత్ పరాభవాన్ని చవిచూసిందని చెప్పాడు. వరుస మ్యాచ్‌ల షెడ్యూల్‌లో పరిస్థితులకు ఎంత వేగంగా అలవాటు పడతామన్నదే కీలకమని, ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో అదే విషయంలో భారత్ వెనుకబడిందని పేర్కొన్నాడు.

బెల్‌ఫాస్ట్‌లో జరిగిన తొలి టీ20లో ఐర్లాండ్ 34 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది. అన్ని ఫార్మాట్లలో టీ20 ప్రపంచ ఛాంపియన్ భారత్‌పై ఐర్లాండ్‌కు ఇది తొలి విజయం. ముందుగా బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ కెప్టెన్ లోర్కాన్ టక్కర్ అర్ధశతకంతో రాణించడంతో 20 ఓవర్లలో 9 వికెట్లకు 182 పరుగులు చేసింది. అనంతరం భారత స్టార్ బ్యాటింగ్ లైనప్ ఒత్తిడిని తట్టుకోలేక 18.5 ఓవర్లలో 148 పరుగులకే ఆలౌటైంది.

భారత్ తరఫున అభిషేక్ శర్మ మాత్రమే ధాటిగా ఆడాడు. కేవలం 20 బంతుల్లోనే 50 పరుగులు చేసి జట్టును పోటీలో నిలబెట్టే ప్రయత్నం చేశాడు. అయితే మరో ఎండ్‌లో వికెట్లు వరుసగా పడిపోవడంతో అతడి పోరాటం వృథా అయింది. మ్యాచ్ అనంతరం అభిషేక్ మాట్లాడుతూ, వరుసగా మ్యాచ్‌లు ఆడేటప్పుడు ప్రాక్టీస్‌కు ఎక్కువ సమయం దొరకదని వివరించాడు. అలాంటి సమయంలో జట్టుగా పరిస్థితులకు వీలైనంత త్వరగా అలవాటు పడటం చాలా ముఖ్యమని చెప్పాడు.

ఆధిపత్యం చెలాయించే జట్టు వేగంగా మార్పులకు తగ్గట్టు ఆడాలని, ఈ మ్యాచ్‌లో కూడా అదే ప్రయత్నం చేసినా అది సఫలం కాలేదని తెలిపాడు. అందుకే ఆశించిన ఫలితం రాలేదని వివరించాడు. ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్ బౌలర్లు అద్భుతంగా రాణించారు. ఎడమచేతి స్పిన్నర్ మాథ్యూ హంఫ్రీస్, పేసర్ మట్ హోలార్డ్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అరంగేట్రం చేసిన జై మూండ్రా నాలుగు ఓవర్లలో 25 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>