కలం, వెబ్ డెస్క్: ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్తో కలిసి నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) కీలక వ్యాఖ్యలు చేశారు. భారత విద్యార్థులు, ప్రతిభావంతులకు ఫిన్లాండ్ ప్రముఖ గమ్యస్థానంగా మారుతోందని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా భారత్–ఫిన్లాండ్ మధ్య సమగ్ర మైగ్రేషన్ అండ్ మొబిలిటీ ఒప్పందంపై సంతకాలు చేసినట్టు మోదీ వెల్లడించారు. ఈ ఒప్పందం ద్వారా రెండు దేశాల ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్స్ను అనుసంధానం చేయడంతో పాటు, సంయుక్త పరిశోధనలకు, స్టార్టప్ సహకారానికి మరింత బలం చేకూరుతుందని చెప్పారు.
విద్యా రంగంలో ఫిన్లాండ్ ప్రపంచానికి ఆదర్శమని ప్రధాని పేర్కొన్నారు. ఉపాధ్యాయ శిక్షణ, పాఠశాలల మధ్య భాగస్వామ్యం, భవిష్యత్ విద్యా విధానాలపై పరిశోధనలను విస్తరించేందుకు రెండు దేశాలు అంగీకరించాయని తెలిపారు. పాఠశాల స్థాయి నుంచి పరిశ్రమల వరకు మానవ వనరుల అభివృద్ధిలో పరస్పర సహకారాన్ని మరింతగా పెంచనున్నామని చెప్పారు.
అలాగే నార్డిక్ ప్రాంతంలో ఫిన్లాండ్ భారత్కు ముఖ్య భాగస్వామి అని మోదీ (Narendra Modi) పేర్కొన్నారు. ఆర్క్టిక్, పోలార్ పరిశోధనల రంగాల్లో కూడా ఫిన్లాండ్తో సహకారాన్ని విస్తరించనున్నట్టు వెల్లడించారు.

