కలం, వెబ్ డెస్క్ : దేశంలో నకిలీ మందుల నివారణకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఔషధాల సరఫరా గొలుసులో నాణ్యత, భద్రత, పారదర్శకతను పెంచేందుకు వ్యాక్సిన్లు, యాంటీమైక్రోబియల్స్, క్యాన్సర్ నిరోధక మందులు, నార్కోటిక్, సైకోట్రోపిక్ డ్రగ్స్పై క్యూఆర్ కోడ్ ఆధారిత ట్రాకింగ్ (Vaccine QR Code) ను తప్పనిసరి చేసింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డ్రగ్స్ రూల్స్ సవరణలు చేపట్టింది. కొత్త నిబంధనల ప్రకారం సంబంధిత మందుల ప్యాకేజింగ్పై క్యూఆర్ కోడ్ లేదా బార్కోడ్ తప్పనిసరిగా ఉండాలి. ఇందులో ఉత్పత్తి గుర్తింపు కోడ్, బ్రాండ్ పేరు, తయారీదారుడి వివరాలు, బ్యాచ్ నంబర్, తయారీ, గడువు తేదీలు వంటి సమాచారం అందుబాటులో ఉంటుంది.
కేంద్రం చర్యతో సరఫరా గొలుసులో ప్రతి దశలో మందుల ప్రామాణికతను ధృవీకరించడం సులభమవుతుందని ప్రభుత్వం వెల్లడించింది. నకిలీ, నాసిరకం మందుల పంపిణీని అరికట్టడంతో పాటు యాంటీ-మైక్రోబయల్ రెసిస్టెన్స్ (AMR) నియంత్రణకు కూడా ఇది దోహదపుడుతుందని తెలిపింది. దశలవారీగా అమలు చేయనున్న ఈ నిబంధనలు వ్యాక్సిన్లు, క్యాన్సర్ నిరోధక మందులు, నార్కోటిక్, సైకోట్రోపిక్ డ్రగ్స్కు 2027 జూలై 1 నుంచి, యాంటీమైక్రోబియల్స్కు 2028 జూలై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. కేంద్రం నిర్ణయంతో నకిలీ మందుల ముఠాకు చెక్ పడే అవకాశం ఉంది.

