కలం, ఖమ్మం బ్యూరో: భద్రాచలంలో (Bhadrachalam) శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా ఎనిమిది అడుగుల అంబికా దర్బార్ బత్తిని వెలిగించడం ప్రత్యేకర్షణగా నిలిచింది. ఈ మహా అగరబత్తిని (Incense Stick) దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ వెలిగించారు. ఇది 36 గంటల పాటు నిర్విరామంగా వెలుగుతుందని నిర్వాహకులు చెప్తున్నారు. సీతారామచంద్ర స్వామివారి ఎదుర్కోలు, తిరు కల్యాణ మహోత్సవం సందర్భంగా ఏపీలోని ఏలూరు నుంచి అంబికా దర్బార్ బత్తి యాజమాన్యం ప్రత్యేకంగా తయారు చేసి పంపించారు. ఈ మహా అగరబత్తి ఓ వైపు సువాసనలు వెదజల్లుతూ, మరో పక్క చూపరులను ఆకట్టుకుంటోంది.
మరోవైపు శ్రీరామ నవమి భద్రాచలం వేడుకలకు సర్వం సిద్ధమైంది. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:31 గంటల మధ్య కల్యాణ మహోత్సవం వైభవంగా జరగనుంది. భక్తుల సౌకర్యార్థం సుమారు 3 లక్షల లడ్డు ప్రసాదాలు, 2 లక్షల తలంబ్రాల ప్యాకెట్లను అధికారులు సిద్ధం చేశారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని చలువ పందిళ్లు, తాగునీరు, మజ్జిగ సౌకర్యాలను కల్పించారు. భద్రత కోసం దాదాపు 2,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

