కలం, మెదక్ బ్యూరో : సిద్దిపేట జిల్లా మిరు దొడ్డి మండలం అల్వాల్ గ్రామంలోని ఐకేపీ (IKP) కేంద్రంలో ధాన్యం కుంభకోణం (IKP paddy scam) వెలుగు చూసింది. ఐకేపీ కేంద్రంలో తాలు, తడిసిన ధాన్యం నెపంతో రైతుల నుండి అదనపు తూకం వేసి సుమారు 109 క్వింటాళ్ల (254 వరి ధాన్యం సంచులు) ధాన్యాన్ని దోపిడీ చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ దోపిడీ చేసిన ధాన్యాన్ని రహస్యంగా ఉంచి, కొనుగోలు కేంద్రం మూసివేసిన తర్వాత ఒక ప్రైవేట్ మిల్లు వద్ద తూకం వేయించారని తెలిపారు.
అనంతరం అదే గ్రామానికి చెందిన ముగ్గురు కౌలు రైతుల పేరిట రూ.2.58 లక్షలను వారి ఖాతాల్లో జమ చేసినట్లు గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో బాధితులైన రైతులు, గ్రామస్థులు గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఆందోళనలు చేపట్టారు. ఐకేపీ సీఏలు, అధికారులు తమను దారుణంగా మోసం చేశారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

