కలం, వెబ్ డెస్క్: క్యుఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2027 ఫలితాలు విడుదలయ్యాయి. ప్రతి ఏటా మాదిరిగానే ఈ సారి కూడా ప్రపంచవ్యాప్త విద్యాసంస్థలతో పోలిస్తే భారతీయ సంస్థల ప్రదర్శనపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ ఏడాది ర్యాంకింగ్స్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ (IIT Delhi) భారతదేశంలోనే అత్యుత్తమ ర్యాంక్ సాధించిన విద్యాసంస్థగా అవతరించింది. గత ఎడిషన్తో పోలిస్తే ఐదు స్థానాలను మెరుగుపరుచుకున్న ఐఐటీ ఢిల్లీ.. 2026లో ఉన్న 123వ స్థానం నుంచి 2027 నాటికి 65.7 ఓవరాల్ స్కోరుతో ప్రపంచవ్యాప్తంగా 118వ స్థానానికి చేరుకుంది. ఈ సంవత్సరం ప్రపంచంలోని టాప్ 200 విశ్వవిద్యాలయాల జాబితాలో కేవలం మూడు భారతీయ విద్యాసంస్థలు మాత్రమే చోటు దక్కించుకోగలిగాయి. ఇందులో ఐఐటీ ఢిల్లీ 118వ స్థానంలో నిలవగా, ఐఐటీ బాంబే 134వ స్థానంలో, ఐఐటీ మద్రాస్ 170వ స్థానంలో నిలిచాయి.
భారతదేశంలోని ఈ టాప్ 3 విశ్వవిద్యాలయాల పనితీరును పరిశీలిస్తే.. ఐఐటీ ఢిల్లీ (IIT Delhi) పలు కీలక విభాగాల్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. పరిశోధనల ప్రభావాన్ని ప్రతిబింబించే ‘సైటేషన్స్ పర్ ఫ్యాకల్టీ’లో 97.3 స్కోరు సాధించగా, అకడమిక్ రిప్యుటేషన్లో 64.6, ఎంప్లాయర్ రిప్యుటేషన్లో 96.9, ఎంప్లాయ్మెంట్ అవుట్కమ్స్లో 59.6 స్కోరు సాధించింది. అలాగే ఇంటర్నేషనల్ రీసెర్చ్ నెట్వర్క్లో 66.5, సస్టైనబిలిటీలో 81.2 స్కోరును నమోదు చేసింది. ఆ తర్వాత బాంబే, మద్రాస్ వర్సిటీలు కూడా అన్ని విభాగాల్లో మంచి స్కోరు సాధించాయి.

