కలం, కరీంనగర్ బ్యూరో : బీఆర్ఎస్ నాయకులు ఎల్లంపల్లి ప్రాజెక్టు, నియోజకవర్గ అభివృద్ధిపై చేస్తున్న అసత్య ప్రచారాన్ని నిరసిస్తూ సోమవారం ధర్మపురి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ (Dharmapuri Congress) ఆధ్వర్యంలో నంది మేడారం పంప్ హౌస్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణతో ముందుకు సాగుతోందని, నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
ప్రజలను తప్పుదోవ పట్టించే ఉద్దేశంతో బీఆర్ఎస్ నాయకులు అసత్య ఆరోపణలు, దుష్ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. నంది పంప్ హౌస్ ద్వారా నంది మేడారం చెరువును నింపుతున్న నీరు కూడా ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచే సరఫరా అవుతోందని పేర్కొన్నారు. ఈ వాస్తవాలను విస్మరించి, ఎల్లంపల్లి నీటిని కాళేశ్వరం నీరుగా చూపిస్తూ బీఆర్ఎస్ పార్టీ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. కాళేశ్వరం పేరుతో అసత్య ప్రచారాలు చేయడం ప్రజలను మభ్యపెట్టడమేనని అన్నారు.
ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటిని కాళేశ్వరం నీరుగా ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు కొప్పుల ఈశ్వర్, జీవన్ రెడ్డి తమ వ్యాఖ్యలపై ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. ప్రజలకు వాస్తవాలు తెలుసని, అభివృద్ధి కార్యక్రమాలే కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు ప్రచారం చేయడం మానుకుని ప్రజా సమస్యలపై నిర్మాణాత్మకంగా స్పందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

