కలం, తెలంగాణ బ్యూరో: స్పెషల్ చీఫ్ సెక్రటరీ వాణీ ప్రసాద్ (Vani Prasad) తెలంగాణ యువజన వ్యవహారాలు, టూరిజం, కల్చర్ విభాగ స్పెషల్ సీఎస్గా నియమితులయ్యారు. ఇంతకాలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేసిన ఆమె ఇటీవలే హైకోర్టు నుంచి ఉత్తర్వులు వెలువడడంతో తెలంగాణకు కేడర్ అయ్యారు. ఇప్పటివరకూ యూత్ ఎఫైర్స్, టూరిజం, కల్చర్ విభాగానికి పూర్తి అదనపు బాధ్యతలు చూసిన ఐఏఎస్ ఆఫీసర్ జయేశ్ రంజన్ ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. యధావిధిగా స్పోర్ట్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా, మెట్రోపాలిటన్ ఏరియా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ స్పెషల్ సీఎస్గా కొనసాగనున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో ఐఏఎస్ ఆఫీసర్లను రెండు రాష్ట్రాల మధ్య పంపిణీ చేసిన ప్రత్యూష్ సిన్హా కమిటీ వాణీప్రసాద్ను (Vani Prasad) ఆంధ్రప్రదేశ్కు కేటాయించారు. ఆమె పుట్టిన స్థలం గుంటూరు కావడంతో దాని ఆధారంగా ఏపీకి అలాట్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఆ మేరకు డీవోపీటీ (DoPT) నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ ఉత్తర్వులను సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్లో ఆమె సవాలు చేశారు. డీవోపీటీ ఉత్తర్వులపై క్యాట్ (CAT) స్టే ఇచ్చింది. దీంతో తెలంగాణలో కొంతకాలం కొనసాగారు. క్యాట్ స్టే ఉత్తర్వులను సవాలు చేస్తూ డీవోపీటీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత ఆమె జన్మస్థలాన్ని ఆధారంగా చేసుకుని కేడర్ను ఖరారు చేయడం సమంజసం కాదని ఆమె తన వాదనలను వినిపించారు. పుట్టింది మాత్రమే గుంటూరులో అని ఎల్కేజీ నుంచి పోస్టు గ్రాడ్యుయేషన్ వరకు మొత్తం తెలంగాణలోనే చదివానని, అందువల్ల తెలంగాణ కేడర్గా గుర్తించాలని కోరారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ఆమెను తెలంగాణకు బదిలీ చేస్తూ తీర్పు వెలువరించింది. ఈ మేరకు డీవోపీటీ సైతం ఆమెను తెలంగాణ కేడర్గా గుర్తిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఆమె ఏపీ ప్రభుత్వం నుంచి తెలంగాణకు షిప్ట్ అయ్యారు. ఇప్పుడు యువజన సర్వీసులు, టూరిజం, కల్చర్ విభాగం స్పెషల్ సీఎస్గా నియమితులయ్యారు.
Read Also: భూభారతి పోర్టల్ ప్రారంభించిన మంత్రి పొంగులేటి
Follow Us On : WhatsApp

