కలం, వెబ్ డెస్క్ : ఒడిశాలోని భువనేశ్వర్ కటక్ మార్గం (Cuttack Highway)లో ఒక దారుణ ఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై వెళ్లేటప్పుడు దారి ఇచ్చే విషయంలో ఒక కారుకు, హైవా ట్రక్కుకు మధ్య తీవ్ర వివాదం నడిచింది. ఈ గొడవ తర్వాత ఆగ్రహంతో ఊగిపోయిన హైవా డ్రైవర్ తన వాహనంతో కారును దాదాపు 200 మీటర్ల దూరం రోడ్డుపై అలాగే ఈడ్చుకెళ్లాడు.
ఈ ఊహించని పరిణామంతో జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న మిగతా వాహనదారులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. రోడ్డంతా గందరగోళంగా మారింది. కారును అంత దూరం లాక్కెళ్లిన తర్వాత సదరు హైవా డ్రైవర్ అక్కడి నుంచి వాహనంతో సహా పారిపోవడానికి ప్రయత్నించాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. రోడ్డుపై నెలకొన్న ఉద్రిక్త పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదానికి కారణమైన వాహనాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతానికి ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు అధికారికంగా ధ్రువీకరణ కాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.

