కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్లోని నాలాలు, వరద కాలువల్లో పేరుకుపోయిన పూడికను తొలగిస్తే.. వర్షాకాలంలో ఇళ్లను వరదలు ముంచెత్తవని సంబంధిత అధికారులకు హైడ్రా (HYDRAA) కమిషనర్ రంగనాథ్ (Ranganath) సూచించారు. నగరంలో జరుగుతున్న డీ సిల్టింగ్ పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించి మాట్లాడారు. నాలాల్లో పూడిక తీయడానికి ఎక్కడైనా ఇంటి వాకిలి అడ్డుగా ఉండి.. తప్పనిసరి పరిస్థితుల్లో తొలగించాల్సి వస్తే వెంటనే ఆ పని పూర్తి చేసి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. రహ్మత్నగర్, కృష్ణానగర్, అమీర్పేట, గాయత్రినగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి స్థానికులతో మాట్లాడారు. తమ ప్రాంతాల్లోని నాలాలు, వరద కాలువల్లో డీసిల్టింగ్ పనులు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. అలాగే వర్షాకాలంలో ఎక్కడెక్కడ ఇబ్బందులు (Flood Prevention) తలెత్తుతున్నాయో.. అందుకు గల కారణాలను, పరిష్కార మార్గాలను స్థానికులతో చర్చించాలని అధికారులకు సూచనలు చేశారు. ప్రస్తుత వేసవి కాలం మంచి అవకాశమని.. వర్షాలు మొదలైన తర్వాత పెద్ద పనులు చేయలేమన్నారు.
వాట్సాప్ గ్రూపుల ద్వారా సమాచారం ఇవ్వాలని సూచన..
డివిజన్ల వారీ వాట్సాప్ గ్రూపులు పెట్టి డీసిల్టింగ్ పనులు జరుగుతున్న తీరుపై ఎప్పటికప్పుడు హైడ్రా (HYDRAA)కు సమాచారం ఇవ్వాలని స్థానిక కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులను రంగనాథ్ కోరారు. “వర్షాకాలం ఇబ్బందులు పడే వారు మీరు.. సమస్య ఎక్కడుందో మీకు చాలా స్ఫష్టంగా తెలుస్తుంది.. ఆ సమస్యకు కారణం, పరిష్కారం కూడా మీకు తెలుసు. ఆ సమాచారం అధికారులకు చేరవేస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం” అని అన్నారు. అటు రహ్మత్నగర్ వంతెన వద్ద పెద్దమొత్తంలో పూడికను తీయడాన్ని ఆయన పరిశీలించారు. కృష్ణానగర్లో వేసవి కాలంలోనే మురుగు రహదారులపైకి రావడాన్ని గమనించారు. ప్రతి వంద మీటర్లకూ పూడిక తీత ఎలా జరుగుతుందనేది స్పష్టత ఉండాలని సూచించారు. ఇప్పుడు పూడికను మొత్తం తొలగిస్తే.. వర్షాకాలం వరద ప్రవాహానికి ఆటంకాలు లేకుండా ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న డీ సిల్టింగ్ పనుల్లో ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తినా.. కావాల్సిన మిషనరీ అవసరమైనా వెంటనే ఆ విషయాన్ని తమ దృష్టికి తీసుకువస్తే సమకూర్చుతామని జీహెచ్ ఎంసీ, జలమండలి అధికారులకు సూచించారు.
Read Also: పేదల పొట్టగొడుతున్న విధానాలను కాంగ్రెస్ ప్రభుత్వం మానుకోవాలి: RSP
Follow Us On: Facebook

