కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్లోని అర్బన్ ల్యాండ్ సీలింగ్ (ULC) భూముల్లోని పాత లే ఔట్లలో ఇళ్లనే కాదు.. ఖాళీ ప్లాట్లు ఉన్నా వాటి జోలికి వెళ్లబోమని హైడ్రా (HYDRAA) ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ భూముల్లోని పాత లే ఔట్లలో రెగ్యులరైజ్ కాని ఖాళీ ప్లాట్లపై హైడ్రా చర్యలు ఉండవని స్పష్టం చేసింది. యూఎల్సీ భూముల్లో వెలసిన లే ఔట్లలో ఖాళీగా ఉన్న ప్లాట్లను హైడ్రా పేరు చెప్పి ఆక్రమించేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే వాటిని అస్సలు నమ్మొద్దని విజ్ఞప్తి చేసింది. ఈ విషయంలో ఏవైనా సందేహాలుంటే నేరుగా హైడ్రా కార్యాలయానికి వచ్చి నివృత్తి చేసుకోవాలని సూచించింది. లే ఔట్ ప్రకారం రహదారులు, పార్కులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలు కబ్జా కాకుండా హైడ్రా కాపాడుతుందని తెలిపింది. హైడ్రా ఏర్పడడానికి ముందు నివాసాలుంటే వాటిని కూల్చమని ఇప్పటికే చాలాసార్లు స్పష్టం చేసింది.
ప్రభుత్వ నిర్ణయం మేరకు ఇదే విధానాన్ని కొనసాగిస్తూ వస్తోంది. ఈ మధ్య కాలంలో శేరిలింగంపల్లి మండలం కొండాపూర్ గ్రామంలోని పలు యూఎల్సీ భూముల్లో వేసిన లే ఔట్లలో పార్కులు, రహదారులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాల ఆక్రమణలను మాత్రమే హైడ్రా (HYDRAA) తొలగించింది. కొండాపూర్ గ్రామంలోని రాజరాజేశ్వరినగర్, ఓయూ కాలనీ, రాఘవేంద్ర కాలనీలోని పార్కులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాల ఆక్రమణలు తొలగింపే ఇందుకు నిదర్శనం. కూకట్పల్లి మండలం హైదర్నగర్లోని యూఎల్సీ భూముల్లో వెలసిన గోపాల్నగర్ లే ఔట్లో పార్కును కూడా ఇదే మాదిరి కాపాడింది. యూఎల్ సీ భూముల్లోని లే ఔట్లలో రెగ్యులరైజ్ కాని ప్లాట్లను హైడ్రా తీసుకుని ప్రభుత్వానికి అప్పజెబుతుందని కొంతమంది కబ్జాదారులు చేస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దని సూచించింది.
Read Also: రంగప్ప చెరువుకు పూర్వవైభవం ఎప్పుడు?
Follow Us On: Facebook

