కలం, వెబ్ డెస్క్: దేశంలోని అగ్రశ్రేణి న్యాయ మేధావులతో కలిసి ఉండటం తనకు గౌరవంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ లో రాష్ట్ర హైకోర్టు జోన్-2 (High Court Zone-2)కు సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడి సభలో సీఎం మాట్లాడారు. ఈ రోజు ఒక ప్రత్యేకమైన రోజు అని, ఒక ప్రత్యేక సందర్భం కోసం ఇక్కడ సమావేశమయ్యామని చెప్పారు. ఇలాంటి రోజు నాయకుల జీవితంలో చాలా అరుదుగా వస్తుందని చెప్పారు. దేశంలో ఒక దేవాలయం, మసీదు, చర్చి లేదా గురుద్వార్ నిర్మించడం గొప్ప విషయమని చెప్పారు. కానీ ఒక కోర్టు సముదాయం నిర్మించడం.. న్యాయం కోసం ఒక ప్రాంగణం సృష్టించడం కూడా అన్ని మతాల ప్రజల కోసం ఒక పవిత్ర స్థలాన్ని నిర్మించినట్లేనని అన్నారు. మన ప్రజాస్వామ్యంలో శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు పరస్పర ఆధారితంగా గౌరవంతో పనిచేస్తాయని చెప్పారు. సాధారణ పౌరుడికి కోర్టు చివరి ఆశ, చివరి ఆశ్రయం అని చెప్పారు. అందువల్ల తెలంగాణ కోసం కొత్త హైకోర్టు నిర్మాణాన్ని ప్రారంభించడం తన ప్రభుత్వానికి ఒక గొప్ప అవకాశం అని, జీవితంలో ఒకసారి వచ్చే అవకాశమన్నారు.
ఈ కొత్త హైకోర్టు సమాజానికి, ప్రజాస్వామ్యానికి ఒక ప్రతీకగా మారుతుందని సీఎం రేవంత్ (CM Revanth Reddy) అభివర్ణించారు. ఇది పేదలు, బలహీనులు న్యాయం కోసం వచ్చే వేదికగా ఉంటుందన్నారు. రాబోయే 100 సంవత్సరాల పాటు పేదలు, బలహీనులు, అణగారినవారు ఈ న్యాయ మందిరానికి వచ్చి తమ వేదనను వినిపించుకుంటారని చెప్పారు. ఈ భవనం కేవలం నిర్మాణం మాత్రమే కాదని.. ఇది తమ ప్రభుత్వ ప్రజాస్వామ్య విలువలకు ప్రతిబింబమని కొనియాడారు. అన్ని వ్యవస్థలు పరస్పర గౌరవంతో, సహకారంతో పనిచేయాలని తాము నమ్ముతున్నట్లు చెప్పారు. న్యాయవ్యవస్థకు అత్యుత్తమ సౌకర్యాలు అందించడం కార్యనిర్వాహక విభాగం బాధ్యతగా తాము భావిస్తున్నట్లు తెలిపారు. ఇక్కడ నిర్మించబడుతున్నది దేశంలో అతిపెద్ద హైకోర్టు సముదాయాల్లో ఒకటిగా మాత్రమే కాకుండా.. ఆధునికత, మౌలిక వసతుల పరంగా ఒక ప్రమాణంగా నిలుస్తుందన్నారు.
2023 డిసెంబర్లో మా ప్రభుత్వం ఏర్పడినప్పుడు తీసుకున్న మొదటి నిర్ణయాల్లో ఇది ఒకటి అని చెప్పారు. ఈ ప్రాజెక్టు కోసం రాజేంద్రనగర్లో 100 ఎకరాలకు పైగా భూమిని కేటాయించామన్నారు. సంస్థ భవనాల కోసం జోన్-1లో పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. ఈ రోజు జోన్-2లో నివాస భవనాలకు శంకుస్థాపన చేస్తున్నామని తెలిపారు. డిసెంబర్ 2027 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 49 కోర్టుల కోసం, అనేక నివాస సముదాయాల కోసం కొత్త ప్రాజెక్టులు కొనసాగుతున్నాయన్నారు. న్యాయవ్యవస్థకు ఉత్తమ మౌలిక సదుపాయాలు అందించడం కార్యనిర్వాహక బాధ్యత అని తాము నమ్ముతున్నట్లు చెప్పారు. అన్ని వ్యవస్థలు పరస్పర గౌరవంతో కలిసి పనిచేసి విభేదాలను నివారించాలని ఆకాంక్షించారు. తాము కేవలం తీర్పులకు మాత్రమే కాకుండా, వివిధ పరిశీలనలకు, అభిప్రాయాలకు కూడా అత్యున్నత గౌరవాన్ని ఇస్తామన్నారు. వచ్చే శతాబ్దం కోసం ఒక అద్భుతమైన భవనాన్ని, ప్రజా జీవితానికి ఒక కీలకమైన పిల్లర్ నిర్మించడానికి అడుగులు వేస్తున్నామని చెప్పారు. అన్నింటికంటే ముఖ్యమైన ‘న్యాయం’ అనే స్ఫూర్తితో మనమందరం ఈ రోజును జరుపుకుందామని పిలుపునిచ్చారు.
Read Also: కూతురికి డైవర్స్.. సెలబ్రేట్ చేసుకున్న పేరెంట్స్, వీడియో వైరల్
Follow Us On: X(Twitter)

