కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్లోని ఎంసీఆర్హెచ్ఆర్డీలో రాష్ట్ర పర్యాటక శాఖపై సోమవారం సీఎం రేవంత్ రెడ్డి ( CM Revanth) కీలక సమీక్ష నిర్వహించారు. టూరిజం వివరాలను అధికారులనుండి అడిగి తెలుసుకున్న సీఎం.. సిటీలోని దుర్గం చెరువును పూర్తి స్థాయి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని సీఎం అధికారులను ఆదేశించారు. తారామతి బారామతిని టూరిజం ప్లేస్ గా మరింత గా అభివృద్ధి చేయాలని సూచించారు. మంజీరా, దిల్ కుషా గెస్ట్హౌస్లను ఆధునీకరించాలన్నారు. టూరిజం హబ్ డెవలప్మెంట్ పథకం కింద వికారాబాద్ను అభివృద్ధి చేయాని చెప్పారు.
వీరభద్రస్వామి ఆలయాన్ని డెవలప్ చేయాలి..
వికారాబాద్ జిల్లాలోని ప్రముఖ వీరభద్రస్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని.. యాదాద్రి తరహాలో ఆలయ కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. క్యూర్ పరిధిలో ఉన్న అటవీ శాఖ భూములను పర్యాటక శాఖతో కలిసి ఎకో టూరిజంగా అభివృద్ధి చేయాలని సూచించారు. గుర్రంగూడ ఎకో పార్క్ తరహాలో నగరంలో ఎకో పార్కులు తీర్చి దిద్దాలని సూచించారు. ఫ్యూచర్ సిటీలో ఉన్న అటవీ భూములను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలని.. అర్బన్ ఫారెస్ట్ తరహాలో ఏర్పాట్లు చేయాలని అన్నారు. అర్బన్ ఫారెస్ట్ ప్రాజెక్ట్ల కోసం స్పెషల్ ఆఫీసర్ను ఏర్పాటు చేసుకొని పనులను ము మ్మరం చేయాలని ఆదేశించారు.
గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్పై చర్చ..
పురానాపూల్ హెరిటేజ్ బ్రిడ్జిలను అభివృద్ధి చేసి పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలని సీఎం ఈ సందర్భంగా సూచించారు. బ్రిడ్జిలపైన పర్యాటకుల కోసం ఏర్పాట్లు చేయాలన్నారు. వీలైతే ట్రాఫిక్ మళ్లించి టూరిస్టులకు అవకాశం కల్పించాలని చెప్పారు.డిసెంబరు లో నిర్వహించే గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ పై కసరత్తు ప్రారంభించాలని అధికారులకు సీఎం సూచించారు. సమ్మిట్ కోసం డిపార్ట్ మెంట్ ల మధ్య సమన్వయం కోసం కమిటీలు ఏర్పాటు చేయాలని చెప్పారు.ఈ సమావేశానికి సీఎం సలహాదారు రామకృష్ణా రావు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, సీఎంఓ ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, పర్యాటక శాఖ సెక్రటరీ వాణి ప్రసాద్, టూరిజం కార్పొరేషన్ ఎండీ గౌతమి హాజరయ్యారు.

