కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ (Hyderabad) మహా నగరంలో ఎండలు దంచికొడుతుండటంతో భూ గర్భ జలాలు వేగంగా అడుగంటిపోతున్నాయి. బంజారాహిల్స్, మాదాపూర్, చందానగర్ కూకట్ పల్లి ప్రాంతాల్లో అయితే పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. బోర్లు వట్టిపోవడంతో.. నీటి కష్టాలు మొదలయ్యాయి. అవసరాల కోసం జలమండలి సరఫరా చేసే నీరే దిక్కయింది.
వెయ్యి ట్యాంకర్లతో నీటి సరఫరా..
జీహెచ్ఎంసీ పరిధిలో సుమారు 1.1 నుంచి 1.2 కోట్లు జనాభా ఉన్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. వీరి కోసం రోజుకు సుమారు 600 గ్యాలన్ల నీరు అవసరం ఉంటుంది. ప్రస్తుతం 580 గ్యాలన్ల వరకు మాత్రమే సరఫరా అవుతోంది. అంటే, రోజుకు 20 గ్యాలన్ల నీరు లోటుగానే ఉంటుంది. వేసవిలో నీటి ఎద్దడి తీర్చేందుకు జలమండలి 1000 ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నట్లు చెబుతుంది. అయితే.. ఇవి సరిపోవడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో, ప్రైవేట్ ట్యాంకర్లను ఆశ్రయిస్తున్నారు. ఒక్కో ట్యాంకర్ కు రూ.2 వేలకు తక్కువ వసూలు చేయడం లేదని జనాలు ఆరోపిస్తున్నారు. వేసవి ఎక్కువ కాలం ఉండటంతో పాటు వర్షాలు తక్కువ పడే అవకాశం ఉండటంతో.. నీటి కష్టాలు ఇప్పట్లో తప్పకపోవచ్చని చెబుతున్నారు.

