కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ (Hyderabad)లో డ్రగ్స్ నెట్వర్క్పై పోలీసులు జరిపిన మూడు వేర్వేరు దాడుల్లో భారీగా గంజాయి, ఎండీఎంఏ (MDMA) స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్లలో మొత్తం ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న ఎన్ఫోర్స్మెంట్ బృందాలు నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. విక్రయానికి సిద్ధంగా ఉన్న మత్తు పదార్థాలను పట్టుకున్నాయి. నిందితులు ఇతర రాష్ట్రాల నుంచి నగరానికి తీసుకువచ్చి యువతకు విక్రయిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
మొదటి కేసులో ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ సమీపంలో ఎండిఎంఏ విక్రయిస్తున్న ఇద్దరిని పట్టుకోగా, మరో రెండు ఘటనల్లో ధూల్పేట, మీర్పేట్ పరిసరాల్లో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ముఠాలను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారి నుంచి సుమారు 1.3 కిలోల గంజాయితోపాటు ఖరీదైన సింథటిక్ డ్రగ్స్ను సీజ్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితులతో పాటు వారికి సహకరిస్తున్న మరికొందరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నగరంలో డ్రగ్స్ రవాణాను అరికట్టేందుకు తనిఖీలను మరింత ముమ్మరం చేస్తామని అధికారులు వెల్లడించారు.

