కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro) స్టేషన్ల కింద పాదచారుల బాటలో స్టాళ్ల ఏర్పాటు అంశం హైకోర్టులో చర్చనీయాంశమైంది. ఫుట్పాత్లను వాణిజ్య అవసరాలకు లీజుకివ్వడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్పై కోర్టు విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా పాదచారుల కోసం ఏర్పాటు చేసిన ఫుట్పాత్లను స్టాళ్లకు లీజుకు ఎలా ఇస్తారని హైకోర్టు ప్రశ్నించింది. ప్రజల రాకపోకలకు కీలకమైన ఈ స్థలాలను వ్యాపార అవసరాలకు వినియోగించడం ఎంతవరకు సమంజసం అని అధికారులను నిలదీసింది.
ఈ అంశంపై వచ్చిన ఫిర్యాదులపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని జీహెచ్ఎంసీ(GHMC), హెచ్ఎంఆర్ఎల్ (Hyderabad Metro Rail Limited) లను హైకోర్టు ఆదేశించింది. పాదచారుల భద్రత, ప్రజా స్థలాల వినియోగం వంటి అంశాలు దృష్టిలో ఉంచుకుని ఈ కేసు ప్రాధాన్యత సంతరించుకుంది. తదుపరి విచారణలో అధికారులు సమర్పించే నివేదిక ఆధారంగా కోర్టు తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

