కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రాజధాని హైదరాబాద్ (Hyderabad) .. భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తనకుంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న మహానగరం. చారిత్రక కట్టడాలు, నోరూరించే బిర్యానీలు, ఐటీ కారిడర్లు, ఫార్మా, నిర్మాణ తదితర రంగాలతో అలరాల్లే ఈ భాగ్యనగరం వివిధ ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి జీవనాధారంగా నిలుస్తోంది. దాదాపు కోటీ 20 లక్షల మందితో ‘మిని ఇండియా’గా పేరు తెచ్చుకున్న హైదరాబాద్ నగరం మరో ఘనత సాధించింది.
దేశంలోనే మిడిల్ క్లాస్ జనాభా అత్యధికంగా ఉన్న నగరంగా హైదరాబాద్ నిలిచింది. “ప్రైస్ & టాటా సన్స్” నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. అంతేకాదు 2030-31 నాటికి హైదరాబాద్ లో మిడిల్ క్లాస్ జనాభా మరింత భారీగా పెరిగే ఛాన్స్ ఉందని నివేదికలో పేర్కొనబడింది. నివేదిక ప్రకారం.. ధనవంతుల కేంద్రాలుగా ఢిల్లీ, ముంబై, పుణె నగరాలు కొనసాగుతున్నాయి. సగటు కుటుంబ ఆదాయంలో బెంగళూరు, చండీగఢ్, ఢిల్లీ టాప్ స్థానాల్లో ఉన్నాయి. దేశంలోని టాప్ 100 నగరాలే దేశ ఆదాయం, వినియోగంలో మూడో వంతుకుపైగా వాటా కలిగి ఉన్నాయని ఈ రిపోర్టు పేర్కొంది. టాప్ నగరాల్లో కటిక పేదరికం దాదాపు కనుమరుగవుతోందని ఈ నివేదిక వెల్లడించింది.
మరోవైపు చంఢీఘడ్, తిరువనంతపురం, వడోదార నగరాలు కుటుంబ ఖర్చుల్లో టాప్ ప్లేస్ లో నిలిచినట్లు రిపోర్టులో తేలింది. దేశంలోని అతిపెద్ద వినియోగ మార్కెట్గా సూరత్ నిలిచిందని.. సూరత్ లో సగటు గృహ వినియోగం ఖర్చు మెట్రో సిటీలను మించి ఉందని పేర్కొంది.

