కలం, మెదక్ బ్యూరో: కేంద్రంలోని బీజేపీ (BJP) ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం ఎస్ఐఆర్ పేరుతో బీఆర్ఎస్ ఓట్లను తొలగించాలన్న కుట్రతో పని చేస్తున్నాయని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి (Gudem Mahipal Reddy) ఆరోపించారు. పటాన్చెరులో నేడు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మినీ ఇండియాగా పేరొందిన పటాన్ చెరు నియోజకవర్గంలో ఎస్ఐఆర్ ప్రక్రియపై ఓటర్లకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించకపోవడం మూలంగా ఓటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
నియోజకవర్గ ఓటు హక్కు అంశం ప్రశ్నార్థకంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నియమించిన బూత్ లెవెల్ అధికారులు క్షేత్రస్థాయిలో ఆశించిన మేరకు పని చేయడం లేదని అసహనం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ తరఫున నియమించబడిన బూత్ లెవెల్ ఏజెంట్లు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ప్రతి ఓటరుకి ఎస్ఐఆర్ పై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి, తమ వివరాలు నమోదు చేయించుకునేలా కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు.
ఇటీవల జరిగిన పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నియోజకవర్గంలో 70 వేల ఓట్లు తొలగించి ఆమెను ఓడించారని ఆరోపించారు. పటాన్చెరు నియోజకవర్గంలో అత్యధిక ఓట్లు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని తొమ్మిది డివిజన్లలో ఉన్నాయన్నారు. రాబోయే బల్దియా ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయాలంటే ప్రతి ఓటును రక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని, ఆ బాధ్యత కార్యకర్తలపై ఉందని తెలిపారు. రెండు చోట్లా ఓటు కలిగిన ఓటర్లకు స్థానికంగానే ఓటు ఉంచుకునేలా సూచించాలని కోరారు.

