కలం, వెబ్డెస్క్: మానవ మనుగడకు నీరే జీవనాధారం. మన శరీరం సజావుగా పనిచేయాలన్నా, నిత్యం ఆరోగ్యంతో అడుగులు వేయాలన్నా శరీరానికి సరిపడా నీటిని అందించడం అత్యంత అవసరం. ఎందుకంటే మన శరీరంలోని అవయవాల పనితీరును సక్రమంగా నిర్వహించడంలో నీరు కీలక పాత్ర పోషిస్తుంది. అంతే కాకుండా జీవక్రియ సక్రమంగా జరిగేందుకు, శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటకు పంపేందుకు, శరీర ఉష్ణోగ్రత నియంత్రణకు నీరు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మూత్ర పిండాలు (Kidney Health) ఆరోగ్యంగా ఉండడానికి నీరు అత్యంత అవసరం.
అయితే శరీరానికి సరిపడా నీరు తాగకపోతే మూత్రపిండాలపై ఒత్తిడి పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అంతే కాకుండా తగిన మోతాదులో నీరు తీసుకోకపోవడం వలన అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
మూత్రపిండాలపై తీవ్ర ఒత్తిడి
శరీరానికి సరిపడా నీరు అందకపోతే, రక్తంలోని వ్యర్థాలను వడపోసే క్రమంలో మూత్రపిండాలపై (Kidneys) విపరీతమైన ఒత్తిడి పడుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తగినంత నీరు తీసుకోకపోవడం వల్ల కిడ్నీల పనితీరు మందగించడమే కాకుండా, శరీరంలోని విషపదార్థాలు లోపలే ఉండిపోయి అనేక ఇతర నూతన ఆరోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదం ఉందట.
అంతే కాకుండా నీరు తక్కువగా తాగడం వలన మూత్రంలో బ్యాక్టీరియా పేరుకుపోయే అవకాశం ఉంటుందట. దీనివల్ల మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ (UTI) వచ్చే ప్రమాదాన్ని ఉంటుంది. అయితే, మూత్ర మార్గం గుండా హానికరమైన బ్యాక్టీరియాను బయటకు పంపేందుకు నీరు చాలా అవసరం. నీరు తక్కువగా తాగడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశం కూడా పెరుగుతుందని చెబుతున్నారు నిపుణులు.
డీహైడ్రేషన్ సమస్య
నీరు తక్కువగా తాగడం వలన శరీరం డీహైడ్రేషన్కు గురవుతుంది. దీనివల్ల జీర్ణరసాల ఉత్పత్తి తగ్గుతుంది. జీర్ణరసాల ఉత్పత్తి తగ్గినప్పుడు గ్యాస్ట్రిటిస్, అల్సర్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మలబద్ధకం సమస్య కూడా తలెత్తుతుందని చెబుతున్నారు. అంతేకాకుండా చర్మ సమస్యలు కూడా రావచ్చు. అంతేకాకుండా మెదడు పనితీరు తగ్గడం, నోటి దుర్వాసన వంటి సమస్యలు వస్తాయని సూచిస్తున్నారు నిపుణులు.

