కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ (AP SSC Supplementary) పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదిక ఎక్స్ ద్వారా ఈ ఫలితాలను అధికారికంగా ప్రకటించారు. ఈ ఏడాది సప్లిమెంటరీ పరీక్షల్లో విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. మొత్తం 94,990 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, వారిలో 78,261 మంది ఉత్తీర్ణత సాధించారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి పాస్ పర్సంటేజ్ 6.25 శాతం పెరిగింది.
పదో తరగతి ప్రధాన పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయిన విద్యార్థుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా అమలు చేసిన 20 రోజుల యాక్షన్ ప్లాన్ ఈ విజయానికి ప్రధాన కారణంగా నిలిచింది. ఈ ప్రణాళిక ద్వారా వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక కోచింగ్ ఇచ్చి, ఉపాధ్యాయులు వ్యక్తిగత శ్రద్ధతో వారిని పరీక్షలకు సిద్ధం చేశారు. అకడమిక్ సపోర్ట్, నిరంతర మార్గదర్శకత్వం అందించడం వల్లే ఈ అద్భుతమైన ఫలితాలు సాధ్యమయ్యాయని మంత్రి లోకేశ్ విద్యార్థులను, ఉపాధ్యాయులను అభినందించారు.
విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్సైట్ www.results.bse.ap.gov.in ద్వారా సులభంగా చూసుకోవచ్చు. హోమ్ పేజీలో కనిపించే లింక్పై క్లిక్ చేసి, హాల్ టికెట్ నంబర్ను నమోదు చేయడం ద్వారా మార్కుల వివరాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మొబైల్లో 95523 00009 నంబర్ను సేవ్ చేసి, వాట్సాప్ ద్వారా కూడా ఫలితాలను పొందే సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించింది.

