కలం, వెబ్ డెస్క్ : ఏపీ రాజధాని అమరావతి పరిధిలోని పెనుమాక రైతులు చేస్తున్న నిరసనకు సంఘీభావంగా అక్కడికి వెళ్లిన మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని నాని, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిలపై కొందరు గుడ్లు, టమోటాలతో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఉండవల్లి సెంటర్ లో జరిగిన ఈ ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత (Vangalapudi Anitha )స్పందించారు. రాజధానిగా అమరావతి పూర్తయితే తమ మనుగడ ఉండదని వైసీపీ డ్రామాలు చేస్తుందని మండిపడ్డారు.
అసలు వైసీపీ నేతలకు అమరావతిలో పర్యటించే అర్హతే లేదని చెప్పారు. అమరావతి రాజధానిని వ్యతిరేకించిన వైసీపీ నేతలు అక్కడ ఎందుకు పర్యటిస్తున్నారని ప్రశ్నించారు. రైతులపై రౌడీయిజం చేసేందుకు వారు అక్కడికి వెళ్లారని ఆరోపించారు. ఏది ఏమైనా 2027 నాటికి తాము అమరావతిని పూర్తి చేస్తామని ఆమె స్పష్టం చేశారు. ఉండవల్లి సెంటర్ లో జరిగిన ఘటనపై విచారణ చేసి పూర్తి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

