కలం, వెబ్ డెస్క్: అసోంలో వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sarma) బాధ్యతలు చేపట్టనున్నారు. ఆదివారం ఎన్డీఏ ఎమ్మెల్యేలు హిమంత బిశ్వ శర్మను శాసనసభపక్ష నేతగా ఎన్నుకున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అసోంలో ఎన్డీఏ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో మే 12న రాష్ట్రంలో ఎన్డీయే సర్కారు కొలువుదీరబోతున్నది. హిమంతతోపాటూ సహచర మంత్రులు కూడా అదే రోజున ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.
మూడోసారి అధికారం చేపట్టనున్న ఎన్డీయే
126 మంది సభ్యులున్న అసోం అసెంబ్లీలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చింది. ఈ ఎన్నికల్లో బీజేపీ 82 స్థానాలు గెలుచుకోగా, మిత్రపక్షాలైన అసోం గణ పరిషత్ (ఏజీపీ), బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (బీపీఎఫ్) చెరో 10 స్థానాలు దక్కించుకున్నాయి. దీంతో ఎన్డీఏ మొత్తం 102 స్థానాలు గెలుచుకున్నది.
వికసిత్ భారత్ ఎన్డీయే లక్ష్యం
బీజేపీకి చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు హిమంత బిశ్వ శర్మ పేరును శాసనసభపక్ష నేతగా ప్రతిపాదించగా సభ్యులంతా ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని కేంద్ర మంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన హిమంత బిశ్వ శర్మకు అభినందనలు తెలిపారు. అసోం ప్రజలు వరుసగా మూడోసారి అభివృద్ధి, స్థిరత్వం, ప్రజా సంక్షేమానికి మద్దతు ఇచ్చారని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ‘వికసిత్ భారత్’ లక్ష్య సాధనతోపాటు ‘వికసిత్ అస్సాం’ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తుందని వ్యాఖ్యానించారు.

