కలం, వెబ్డెస్క్: నేటి కాలంలో స్మార్ట్ఫోన్ చేతిలో ఉంటే చాలు.. జేబులో రూపాయి క్యాష్ లేకపోయినా ప్రపంచాన్ని చుట్టేసి రావచ్చు. టీ కొట్టు నుండి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వరకు ప్రతిచోటా డిజిటల్ చెల్లింపులే (UPI Payments) రాజ్యమేలుతున్నాయి. గూగుల్ పే (Google Pay), ఫోన్ పే (Phone Pay), పేటిఎమ్ (paytm) వంటి యాప్స్ మన జీవితాలను అంతలా మార్చేశాయి. అయితే, చాలామంది తమ సౌకర్యం కోసం లేదా రకరకాల ఆఫర్ల కోసం ఒకే ఫోన్లో, ఒకే నంబర్పై నాలుగైదు యూపీఐ యాప్ (UPI Apps) లను డౌన్లోడ్ చేసుకొని వాడుతుంటారు. ఒకే ఫోన్లో ఎక్కువ UPI అకౌంట్స్ ఉండడం వల్ల భవిష్యత్తులో తీవ్రమైన నష్టాలు వచ్చే అవకాశం ఉందని ఆర్థిక, సైబర్ భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రతి బ్యాంకు ఖాతాకు వేర్వేరు యూపీఐ పిన్లు ఉండటం వల్ల అదనపు భద్రత లభిస్తుంది. అయితే ఫోన్ ఒకే ఇంటర్ఫేస్గా పనిచేయడం వల్ల, పరికరం భద్రత అత్యంత కీలకంగా మారుతోంది. సైబర్ మోసాలకు సంబంధించిన ప్రధాన ప్రమాదం ఫోన్ భద్రత బలహీనంగా ఉండటమే. ఫోన్ హ్యాక్ కావడం లేదా ఇతరుల చేతుల్లో పడటం వల్ల అనధికారిక లావాదేవీల ప్రమాదం పెరుగుతుంది. యూపీఐ పిన్ అవసరమైనప్పటికీ, ఫోన్లోని బ్యాంకింగ్ యాప్లకు యాక్సెస్ దొరికితే మోసగాళ్లు వివిధ రకాల పద్ధతుల్లో డబ్బు దోచుకునే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.
దీనికోసం మనం కొన్ని జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. వినియోగదారులు తమ ఫోన్లో బలమైన స్క్రీన్ లాక్, ఫింగర్ప్రింట్ లేదా ఫేస్ అన్లాక్ వంటి బయోమెట్రిక్ భద్రతా ఫీచర్లను తప్పనిసరిగా ఉపయోగించాలని సూచిస్తున్నారు. అలాగే ఫోన్ను ఇతరులకు ఇవ్వడం, అనధికారిక యాప్లను డౌన్లోడ్ చేయడం, తెలియని లింక్లపై క్లిక్ చేయడం వంటి చర్యలను నివారించాలని సూచిస్తున్నారు. బహుళ బ్యాంకు ఖాతాలను ఉపయోగించే వారు యాప్లో ప్రతి ఖాతాకు స్పష్టమైన పేరు పెట్టుకోవడం మంచిదట. దీంతో చెల్లింపులు చేసే సమయంలో తప్పు ఖాతా ఎంపిక చేసే ప్రమాదం తగ్గుతుంది. అలాగే అన్ని ఖాతాల లావాదేవీలను క్రమం తప్పకుండా తనిఖీ చేస్తూ అనుమానాస్పద కార్యకలాపాలను వెంటనే గుర్తించాలని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
ఉపయోగంలో లేని బ్యాంకు ఖాతాలను యాప్ నుంచి తొలగించడం కూడా భద్రత పరంగా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఫోన్ దొంగిలించబడిన సందర్భంలో వెంటనే సిమ్ బ్లాక్ చేయించడం, బ్యాంకులకు సమాచారం ఇవ్వడం, యూపీఐ సేవలను తాత్కాలికంగా నిలిపివేయడం అత్యవసరం. సాంకేతిక పరిజ్ఞానాన్ని జాగ్రత్తగా ఉపయోగిస్తే బహుళ యూపీఐ ఖాతాలను ఒకే ఫోన్లో సురక్షితంగా నిర్వహించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

