కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటరు జాబితాల ప్రత్యేక సవరణ ప్రక్రియపై (SIR Process) ఇవాళ కీలక సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి భేటీ కానున్నారు. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంపై సమావేశంలో చర్చించనున్నారు.
ఈ సందర్భంగా ఓటరు జాబితాల సవరణ ప్రక్రియ, కొత్త ఓటర్ల నమోదు, పేర్ల తొలగింపు, మార్పులు–చేర్పులపై రాజకీయ పార్టీలకు అధికారులు వివరాలు తెలియజేయనున్నారు. అలాగే ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు తీసుకుంటున్న చర్యలను కూడా వెల్లడించనున్నారు. అధికారుల ప్రకారం, ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియను జూన్ 14 నుంచి జులై 14 వరకు నిర్వహించనున్నారు. ఈ నెల రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఓటరు జాబితాల పరిశీలన, అభ్యంతరాల స్వీకరణ, కొత్త దరఖాస్తుల నమోదు చేపట్టనున్నారు. రాజకీయ పార్టీల సూచనలు, అభిప్రాయాలను కూడా ఈ సమావేశంలో పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది.

