ఖమ్మం ఖిల్లాలో ఘనంగా ‘హెరిటేజ్ వాక్’!

​కలం, ఖమ్మం బ్యూరో: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా ఖమ్మం (Khammam) చారిత్రక ఖిల్లాలో బుధవారం ‘హెరిటేజ్ వాక్’ (సాంస్కృతిక నడక) అత్యంత ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా పర్యాటక శాఖ, యువజన క్రీడల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి విద్యార్థులు, యువత నుంచి విశేష స్పందన లభించింది. ​ఖమ్మం ఖిల్లా మెట్ల వద్ద ప్రారంభమైన ఈ హెరిటేజ్ వాక్ (Heritage Walk).. కోట పైభాగం మీదుగా చారిత్రక ‘జాఫర్ బావి’ వరకు ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది. ఈ వాక్‌లో పాల్గొన్న విద్యార్థులకు, యువతకు ఖిల్లా విశిష్టతను, దాని వెనుక ఉన్న చారిత్రక ప్రాధాన్యతను అధికారులు క్షుణ్ణంగా వివరించారు.

ఈ సందర్భంగా జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి తుంబురు సునీల్ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు, ఇక్కడి పర్యాటక అవకాశాలను ప్రపంచానికి చాటిచెప్పేందుకు ఇలాంటి హెరిటేజ్ కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. ప్రస్తుతం జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉత్సవాలకు ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తోందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన విద్యార్థులకు, యువతకు ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అసిస్టెంట్ ఇంజనీర్ నరేష్ నాయక్, టూరిజం శాఖ సిబ్బంది, పలు పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, స్థానిక యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>