కలం, నిర్మల్ : తెలంగాణ శాసనసభలో (Telangana Assembly) సోమవారం రాజ్యసభ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ ఎథిక్స్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాజ్యసభ ఎథిక్స్ కమిటీ (Ethics Committee) సభ్యులతో పాటు తెలంగాణ శాసన మండలి ఛైర్మన్, శాసనసభ స్పీకర్, శాసన మండలి, శాసనసభలోని వివిధ రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లు పాల్గొన్నారు. బీజేపీ శాసనసభాపక్ష నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Alleti Maheshwar Reddy) కూడా హాజరయ్యారు.
సమావేశంలో ప్రజాప్రతినిధుల నడవడి నియమావళి (కోడ్ ఆఫ్ కండక్ట్), శాసనసభల ఎథిక్స్ కమిటీల పనితీరు, ప్రజాప్రతినిధుల బాధ్యతలు, జవాబుదారీతనం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో శాసనసభల గౌరవాన్ని మరింత పెంపొందించడంతో పాటు ప్రజాప్రతినిధులలో నైతిక విలువలు, పారదర్శకత, జవాబుదారీతనాన్ని బలోపేతం చేయడానికి ఇలాంటి సమావేశాలు ఉపయోగపడతాయని సభ్యులు అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజలలో విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఈ చర్చలు దోహదపడతాయని పేర్కొన్నారు.

