కలం, వరంగల్: ములుగు జిల్లాలో త్వరలో జరగనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు వేగం పుంజుకున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితులు, సీఎం పర్యటన ఏర్పాట్లు, మేడారం అభివృద్ధి పనుల పురోగతిపై మంత్రి సీతక్క అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మేడారంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, పెండింగ్లో ఉన్న పనులను వచ్చే 10 రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
సీఎం రేవంత్ రెడ్డి త్వరలో మేడారం, ములుగు జిల్లాల్లో పర్యటించి, సమ్మక్క-సారలమ్మ ఆలయంలో సమ్మక్క-సారలమ్మలను దర్శించుకోనున్నట్లు తెలిపారు. ఈ పర్యటనలో రూ.6,000 కోట్లకుపైగా విలువైన పంచాయతీరాజ్ శాఖ అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శ్రీకారం చుట్టనున్నారు. అలాగే ఎర్రి ఘట్టమ్మ సమీపంలో పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.
అదేవిధంగా ములుగు కలెక్టరేట్ భవనం, మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్, కేంద్ర విద్యాలయం సహా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు సీఎం చేతుల మీదుగా జరగనున్నాయని మంత్రి తెలిపారు. సీఎం పర్యటనకు సంబంధించిన ఖచ్చితమైన తేదీని త్వరలో అధికారికంగా ప్రకటిస్తామని మంత్రి సీతక్క వెల్లడించారు.

