కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) జిల్లా కేంద్రంలో నిన్న రాత్రి కురిసిన వర్షాలు, భారీ గాలుల కారణంగా పలు చోట్ల చెట్లు కూలిపోయి రోడ్లకు అడ్డంగా పడిపోయాయి. కరీంనగర్ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు 42వ డివిజన్ పరిధిలోని కశ్మీర్ గడ్డ, గోదాం రోడ్, కలెక్టరేట్ రోడ్, జెడ్.పి క్వార్టర్స్ పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. జెడ్.పి. క్వార్టర్స్లోని వృద్ధుల సంరక్షణ కేంద్రం వద్ద భారీ వృక్షం కూలి విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. సునీల్ రావు విద్యుత్ పునరుద్ధరణ పనులు వేగవంతం అయ్యేలా అధికారులతో మాట్లాడి చర్యలు చేపట్టారు. రాబోయే రోజుల్లో కూడా అకాల వర్షాలు, భారీ గాలులు వీచే సూచనలు ఉన్నందున, తల్లిదండ్రులు పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రమాదకరమైన చెట్ల కింద, పాతబడిన గోడల వద్ద ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా మున్సిపల్ సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉంటారని సంబంధిత కార్పొరేటర్లు, అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.

