కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో ఈ నెల 26 వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం, క్యూములోనింబస్ మేఘాలతో వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు వివరించింది. రాష్ట్రంలో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. సోమవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు వర్ష సూచన ఉన్నట్లు వెల్లడించింది. వాతావరణశాఖ వర్షం కురిసే జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. వర్షాలతో గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో స్వల్ప మార్పు చోటుచేసుకునే చాన్స్ ఉందని పేర్కొంది. అటు ఆదివారం సాయంత్రం నుంచి రాత్రివరకు మెదక్ జిల్లాలో కురిసిన వడగళ్ల వానకు భారీగా పంట నష్టం వాటిల్లింది. చేగుంట మండలంలో కోతకు వచ్చిన వరి పంట నేలకొరిగింది. పలు గ్రామాల్లో సుమారు 200 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లగా, చేగుంట మండలం గొల్లపల్లి గ్రామంలో బొప్పాయి పంటకు నష్టం వాటిల్లింది.
రాష్ట్రంలోని పలు చోట్ల వడగండ్ల వాన బీభత్సం స్పష్టించింది. హైదరాబాద్లోని పలు ప్రాంతాలతోపాటు నిజామాబాద్ రూరల్, బాల్కొండ నియోజకవర్గాల్లో వడగండ్ల వర్షం కురిసింది. నిజామాబాద్లో పలు చోట్ల సుమారు గంటపాటు వడగండ్ల వర్షం కురిసింది. హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో వడగండ్ల వర్షం కురిసింది. సుచిత్రా సర్కిల్, కొంపల్లి, సికింద్రాబాద్, తిరుమలగిరి, అల్వాల్, కూకట్పల్లి, కేపీహెచ్బీ, మియాపూర్, చందానగర్, చింతల్, సూరారం, దుండిగల్లో వడగండ్ల వాన కురిసింది. నిజామాబాద్ జిల్లాలోని సిరికొండ, కొండూరు, మైలారం, పెద్ద వాల్గోట్ , చిన్న వాల్గోట్, భీంగల్ తదితర గ్రామాల్లో భారీ వర్షంతో జనజీవనం స్తంభించింది. రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దైంది. అకాల వర్షంతో అరబెట్టిన ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

